ఏపీలో టెన్త్ విద్యార్థులకు దూరదర్శన్ పాఠాలు- షెడ్యూల్ ఇదే
ఏపీలో ప్రస్తుత విద్యాసంవత్సరం తొమ్మిదో తరగతి నుంచి పదో తరగతికి వెళ్లిన విద్యార్థులకు దూరదర్శన్ ద్వారా ఆన్ లైన్ పాఠాలు బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్ధులు ఇళ్లలో నుంచి బయటికి వచ్చే పరిస్ధితి లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఈనెల 25వ తేదీ నుంచి దూరదర్శన్ సప్తగిరి చానల్ ద్వారా ఈ పాఠాలు ప్రారంభం కానున్నాయి.
ప్రతీ రోజూ రెండు గంటల పాటు ఈ పాఠాలను బోధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25న హిందీ, ఫిజికల్ సైన్సు,26న ఇంగ్లీషు, నేచురల్ సైన్సు,27న తెలుగు, సోషల్ స్టడీస్,28న హిందీ, గణితం,29న ఇంగ్లీషు, ఫిజికల్ సైన్సు,30న తెలుగు, నేచురల్ సైన్సు పాఠాలు బోధిస్తారని, ఈ అవకాశాన్ని పదోతరగతి విద్యార్థులు వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు.
ఉదయం 10 నుంచి 11గంటల వరకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు గణితం, జనరల్ సైన్సు, సోషల్ స్టడీస్ సబ్జెక్టులను బోధిస్తారు.పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేంతవరకు వీడియో పాఠాలు కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.