అగ్రిగోల్ద్ బాధితులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం ..264,99 కోట్ల రూపాయలు విడుదల
Recommended Video
అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. ఎన్నికల హామీల అమలులో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితుల ఆదుకుంటామని ఇచ్చిన హామీ మేరకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 264,99,00,983లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మొత్తాన్ని మొదట రాష్ట్రంలోని 13 జిల్లాలో రూ.10 వేల లోపు డిపాజిట్లు కలిగిన 3,69,655 మందికి పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్ఎం కిషోర్కుమార్ ప్రకటించారు.
అగ్రిగోల్ద్ బాధితులకోసం బడ్జెట్లో రూ.1,150 కోట్లు కేటాయించిన సీఎం జగన్
వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే అగ్రిగోల్ద్ బాధితులకు అండగా నిలిచారు. గత టీడీపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. అగ్రిగోల్ద్ బాధితులను ఆడుకుంటా అని భరోసా ఇచ్చారు.ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగిన మంత్రివర్గ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బడ్జెట్లో రూ.1,150 కోట్లు కేటాయించారు సీఎం జగన్.
తొలిదశలో 264,99 కోట్ల రూపాయలు విడుదల
తాజాగా తొలిదశలో రూ.264,99,00,983 రాష్ట్రంలోని 3,69,655 మంది డిపాజిటర్లకు పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇక దీనికి సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా లీగల్ సెల్ అథారిటీ చైర్మన్, కలెక్టర్లు ప్రతిపాదించిన ప్రకారం రూ.10 వేల లోపు డిపాజిటర్ల జాబితాకు అనుగుణంగా ఈ విడుదల చేసిన మొత్తాన్ని పంపిణీ చేయనున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకోవడం లేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.
గతంలో ప్రతిపక్ష నేతగా అగ్రిగోల్ద్ బాధితులకోసం పోరాటం చేసిన జగన్
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ కోరినా చంద్రబాబు అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకోలేక పోయారు. కూలీలు, పేదలు, మధ్యతరగతి వర్గాలు ఎంతోమంది అగ్రిగోల్డ్లో డిపాజిట్ చేసి నష్టపోయారు. ఇక వారందరికీ అగ్రిగోల్డ్ బాధితుల భరోసా కమిటీ ద్వారా వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే అండగా నిలిచారు. ఇక ఇప్పుడు వారి కోసమే నిధులు విడుదల చేశారు.
రూ.20 వేల డిపాజిట్లకు సంబంధించి కొనసాగుతున్న పరిశీలన
అంతేకాకుండా రూ.20 వేల డిపాజిట్లకు సంబంధించి కూడా ఎంత మంది బాధితులు ఉన్నారు? ఎంత సొమ్ము విడుదల చేయాల్సి ఉంటుంది? అన్నదానిపై, ఆర్థిక ఒడిదుడుకులలో ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం పరిశీలన జరుపుతున్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్ చొరవ చూపి అగ్రి గోల్డ్ బాధితులకు కాస్త ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంటున్న నేపధ్యంలో అగ్రిగోల్ద్ బాధితుల్లో చిగురాశలు మొలకెత్తాయి. కష్టపడి సంపాదించి డిపాజిట్ చేసిన సొమ్ము ఇక రాదనీ బాధ పడిన వారు సీఎం జగన్ అగ్రి గోల్డ్ బాధితుల గురించి ఆలోచిస్తారని భావిస్తున్నారు. తాజాగా బాధితులకు ఇవ్వటానికి నిధులు విడుదల చెయ్యటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.