ఆ లిఫ్ట్ ఇరిగేషన్కు వైఎస్ పేరు: నదుల అనుసంధానంలో భాగం: పల్నాడు కరవు నివారణ కోసం
అమరావతి: రాష్ట్రంలో అధికార మార్పిడి చోటు చేసుకున్న తరువాత కొన్ని పథకాల పేర్లల్లోనూ మార్పులు చేర్పులు కనిపిస్తుంటాయి. ఇది సహజం. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో ప్రవేశపెట్టిన పథకాలకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త పేర్లు పెట్టింది. తెలుగుదేశం ప్రభుత్వం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతికి అధికార మార్పిడి చోటు చేసుకోవడంతో..పథకాల పేర్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
గోదావరి-పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా ప్రతిపాదించిన వరికపుడిసెల (దొమ్మర్లగొంది) ఎత్తిపోతల పథకానికి వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్తగా పేరు పెట్టింది. వైఎస్సార్ పల్నాడు కరవు నివారణా ప్రాజెక్టుగా నామకరణం చేసింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందట నోటిఫికేషన్ను విడుదల చేసింది. జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ మేరకు జీవో జారీ చేశారు. ఈ ఎత్తిపోతల పథకాన్ని 2021 నాటికి పూర్తి చేసేలా ప్రభుత్వం ఇదివరకే క్యాలెండర్ను ప్రకటించింది.
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలో నాగార్జునసాగర్ రిజర్వాయర్పై వరికపుడిసెల వాగు ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. ఇదివరకే దీనికోసం సుమారు 50 లక్షల బడ్జెట్ను దీనికోసం కేటాయించారు. ఈ ఎత్తిపోతల పథకం పూర్తయితే గుంటూరు జిల్లాలోని మాచర్ల ప్రాంతంలో అదనంగా 30 వేల హెక్టార్లకు సాగునీరు కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి వరికపుడిసెల జలసాధన సమితి సైతం ఆవిర్భవించింది.
1996 అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి పనులు పెద్దగా చేపట్టలేదనేది వరికపుడిసెల జలసాధన సమితి నాయకుల వాదన. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆశించిన స్థాయిలో పనుల్లో కదలిక నెలకొంది. ఆ తరువాత మళ్లీ ఈ ఎత్తిపోతల పథకం మొదటికొచ్చింది. అప్పటి నుంచీ జలసాధన సమితి నాయకులు తరచూ పల్నాడు ప్రాంతంలో ఉద్యమాలను నిర్వహిస్తూ వస్తున్నారు.
Recommended Video
వినుకొండకు చెందిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు కూా ఇదివరకు ఈ జలసాధన సమితిలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే బొల్లాపల్లి, వెల్దుర్తి, పుల్లల చెరువు, మాచర్ల ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయనేది ఉద్యమ నేతల వాదన. సుమారు రెండు లక్షల ఎకరాలకు పైగా సాగునీటితో పాటు ఆ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చే ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.