ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ ఆలస్యం- పెరిగిపోతున్న అక్రమాలు- మారిపోతున్న జాబితాలు...
ఏపీలో ఇళ్ల స్ధలాల పంపిణీ కార్యక్రమానికి సీఎం జగన్ ఎప్పుడు ముహుర్తం పెట్టుకున్నా దానికి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ప్రధానంగా కరోనా కారణంగా ఈ కార్యక్రమం ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడింది. దీంతో తమకు అసలు ఇళ్ల పట్టాలు వస్తాయా రావా అని పేదలు ఎదురుచూస్తుండగా.. వీరి నుంచి భారీ మొత్తాలు డిమాండ్ చేస్తూ అధికార పార్టీ నేతలు తమ విశ్వరూపం చూపుతున్నారు. ప్రస్తుతం ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడటం వీరికి మరింత కలిసి వస్తోంది.
జగన్ నిర్ణయాన్ని కాపీ కొడుతున్న మరో రాష్ట్రం- మరింత పక్కాగా... అమలుతో పెను ప్రభావం..
వాయిదా ఎందరికో వరం...
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడటం స్ధూలంగా చూస్తే కరోనా కారణంగా ప్రభుత్వ అనివార్యతకు నిదర్శనం మాత్రమే. కానీ ప్రస్తుతం అది రాష్ట్రంలో అధికార పార్టీ నేతలకు వరంగా మారుతోంది. ఇళ్ల స్ధలాల ఎంపికలో చివరి నిమిషం వరకూ లబ్ది దారులను గుర్తించాలని సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలు కూడా అక్రమార్కులకు కలిసి వస్తున్నాయి. ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అందిన కాడికి వసూలు చేసుకుంటున్న వీరంతా తాజా వాయిదాతో పండగ చేసుకుంటున్నారు. ఈ పరిస్ధితి సహజంగానే లబ్ది దారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
20 వేల నుంచి 60 వేల వరకూ...
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాల్లో ఇళ్ల స్ధలాల కోసం అధికార పార్టీలోని కిందిస్ధాయి నేతల ద్వారా ఎమ్మెల్యేలు ఒక్కో పట్టాకు 20 వేల నుంచి 60 వేల వరకూ వసూలు చేస్తున్నారు. పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స్ధలాలకు అయితే 20 వేల రూపాయలు వసూలు చేస్తుండగా... సెమీ రూరల్ అయితే 30 వేలు... పట్టణాలకు దగ్గరగా ఉంటే 40 వేలు... నగరాలకు దగ్గరగా ఉంటే 60 వేల వరకూ వసూలు చేస్తున్నారు. ప్రతీ లబ్దిదారుడి నుంచి గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా నడిపిస్తున్నారు. డబ్పులు సమర్పించుకున్న వారికే పట్టాలంటూ బహిరంగంగానే వారికి అధికార నేతలు చెబుతున్నారు.
పంపకాల విభేదాలతో బట్టబయలు...
ఇళ్ల స్ధలాల పంపిణీలో జరుగుతున్న వసూళ్ల దందాపై క్షేత్రస్ధాయిలో తీవ్ర విమర్శలు వస్తున్నా పట్టించుకునేందుకు అధికార వైసీపీ సిద్ధంగా లేదు. ఇప్పటికే స్వయంగా గృహనిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగంగా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకు సీఎం జగన్ పిలిపించి క్లాస్ కూడా పీకారు. ఆ తర్వాత ఆయన శాంతించారు. ఇదే కోవలో రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం ఇళ్ల స్ధలాల పంపిణీ అక్రమాలపై విమర్శలు చేశారు. అయినా దీన్ని పట్టించుకునే పరిస్ధితుల్లో అధికార పక్షం ఉన్నట్లు కనిపించడం లేదు. దీంతో గ్రామ స్ధాయిలో నేతలు రెచ్చిపోతున్నారు.
Recommended Video
వాయిదాతో మరిన్ని అక్రమాలు..
ఇళ్ల పట్టాల కోసం ఇప్పటికే లబ్ది దారుల నుంచి వసూళ్లు పూర్తి చేసిన నేతలు... పంపిణీ కార్యక్రమం వాయిదా పడటంతో దీన్ని సొమ్ముచేసుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు. చాలా చోట్ల ఇప్పటికే ఒ లబ్ది దారుడి వద్ద డబ్బులు వసూలు చేసిన తర్వాత కూడా అంతకంటే ఎక్కువ డబ్బులు ఇస్తానంటే మరో లబ్ది దారుడికి ఆ స్ధలాన్ని కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో జాబితాల్లోనూ భారీగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాత్రికి రాత్ర్రే ఎక్కువ మొత్తాలు ఇచ్చిన వారి పేర్లను ఎక్కువ విలువైన స్ధలాల జాబితాల్లో చేర్చేస్తున్నారు. దీనికి అధికారులు కూడా అడ్డుచెప్పలేని పరిస్దితి నెలకొనడంతో వీరి హవా నిరాటంకంగా కొనసాగుతోంది.