సీబీఐపై ఎపి ప్రభుత్వం సంచలన నిర్ణయం...రాష్ట్రంలో అడుగుపెట్టరాదు;మేమే చూసుకుంటాం!
Recommended Video
అమరావతి:సిబిఐకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సిబిఐ అడుగుపెట్టేందుకు అనుమతి ఉపసంహరించుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఫలితంగా ఎపిలోని కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులపై దాడి చేయడానికి సీబీఐకి అవకాశం ఉండదు. అంతర్గత విభేదాలతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రతిష్ఠ మసకబారిందని...అందువల్ల రాష్ట్రంలో ఇక ఆ సంస్థ జోక్యం అనవసరమని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎపి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది.
సిబిఐ విచారణకు...అనుమతి ఉపసంహరణ
సీబీఐ ఆంధ్రప్రదేశ్ లో దాడులు,విచారణ జరిపే అధికారానికి అంగీకారాన్ని నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎపిలో సిబిఐ ప్రవేశానికి అనుమతి ఇచ్చే ‘కన్సెంట్' ఉత్తర్వును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. నిబంధనల ప్రకారం ఒక్క ఢిల్లీ మినహా ఏ రాష్ట్రంలోనైనా సీబీఐ తన అధికారాలను వినియోగించుకోవాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమ్మతిని తెలియజేయాల్సి ఉంటుంది. అయితే ఈ విషయమై ఎపి ప్రభుత్వం గతంలో తాను ఇచ్చిన జనరల్ కన్సెంట్ ను ఉపసంహరించుకుంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక సిబిఐ పని...ఎసిబినే చూస్తుంది
దీంతో ఇకపై ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులపై దాడులు నిర్వహించడానికి, వారిపై విచారణ జరపడానికి సీబీఐకి అనుమతి ఉండదు. చట్టప్రకారం దేశంలో ఏదేని రాష్ట్రంలో అవినీతిపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థ సిబిఐ, ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఏసీబీ రెండూ అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి విచారణ జరిపుతాయి.
ఆ సంస్థలకు...బుద్ది చెప్పాలనే
అయితే సిబిఐకి అనుమతి నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో సీబీఐ ఆంధ్రప్రదేశ్ లో విచారణ జరిపే అవకాశం లేకపోవడంతో ఇక ఎపిలో సీబీఐ పాత్రను కూడా రాష్ట్ర దర్యాప్తు సంస్థ అయిన ఏసీబీనే చేపడుతుందని తెలుస్తోంది. ఆ ప్రకారం భౌగోళికంగా రాష్ట్రం పరిధిలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలపై కూడా ఎసిబినే దాడులు చేయొచ్చని అంటున్నారు. ఆ విధంగా ఇన్ కమ్ టాక్స్, పోర్టులు, పోస్టాఫీసులు, సెంట్రల్ ఎక్సైజ్, టెలిఫోన్ కార్యాలయాలు తదిదర కేంద్ర ప్రభుత్వ శాఖలు వాటిలోని ఉద్యోగులపై దాడులు చేసేందుకు, సోదాలు నిర్వహించేందుకు, కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
కొత్త అధికారాలపై ...ఎసిబి కసరత్తు
ఆ ప్రకారం తమకు కొత్తగా సమకూరే ఈ అధికారాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఏసీబీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందని సమాచారం. ఎపి ప్రభుత్వంపై కక్షతో కేంద్రం రాష్ట్రంలో చేయిస్తున్న దాడులకు సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలకు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తగిన గుణపాఠం చెప్పాలని భావిస్తున్నట్లు తెలిసింది. కేంద్రం తమ పట్ల కక్షతో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని...అందుకు ధీటుగా తగిన సమాధానం చెప్పే తీరుతామని కేంద్రానికి తమ తాజా చర్యల ద్వారా హెచ్చరికలు జారీ చేయాలని ఎపి ప్రభుత్వం భావన కావొచ్చనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.