హెరిటేజ్కు చెక్ పెట్టేందుకే అమూల్- అసెంబ్లీలో ఆసక్తికర చర్చ- అదేం లేదన్న వైసీపీ సర్కార్
ఏపీ అసెంబ్లీలో ఇవాళ రాష్ట్రంలో కొత్తగా అడుగుపెడుతున్న అమూల్ ప్రాజెక్టుపై చర్చ జరిగింది. రాష్ట్రంలో పాల ఉత్పత్తి రంగంలో పెను మార్పులకు కారణమవుతుందని ప్రభుత్వం చెబుతున్న అమూల్ ప్రాజెక్టు... విపక్ష నేత చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్కు చెక్ పెట్టేందుకే అని టీడీపీ ఆరోపిస్తోంది.
అమూల్ ప్రాజెక్టుపై చర్చ చేపట్టకముందే ఉపాధి హామీ పథకం నిదుల విడుదలలో ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. అనంతరం మిగతా సభ్యులు కూడా సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం అమూల్పై చర్చ చేపట్టింది. అమూల్ రాకతో రాష్ట్రంలో పాల ఉత్పత్తి రంగంలో పెను మార్పులు వస్తాయని, ముఖ్యంగా పాల ఉత్పత్తి భారీగా పెరగబోతోందని ప్రభుత్వం తెలిపింది. అమూల్ రాకతో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్కు ఇబ్బందులు వస్తాయన్న వాదన తప్పని మంత్రులు సీదిరి అప్పలరాజు, కన్నబాబు స్ఫష్టం చేశారు.
గతంలో చంద్రబాబు కుటుంబం డెయిరీ రంగాన్ని నాశనం చేసిందని, టీడీపీ ప్రభుత్వాల హయాంలో దెబ్బతిన్న డెయిరీ రంగాన్ని గాడిన పెట్టేందుకు, మూతపడిన చిత్తూరు డెయిరీని తెరిపించేందుకు అమూల్ ఉపయోగపడుతుందని మంత్రులు తెలిపారు. ఈ సందర్భంగా సంగం డెయిరీతో పాటు ఇతర డెయిరీల విషయంలో చోటు చేసుకున్న వివాదాలు, అవి ఎదుర్కొన్న సమస్యలను మంత్రులు సభ దృష్టికి తెచ్చారు. అమూల్ వంటి సహకార దిగ్గజం రాష్ట్రంలో అడుగుపెడుతుంటే దీన్ని తట్టుకోలేక టీడీపీ విమర్శలు చేస్తోందని మంత్రులు విమర్శించారు. టీడీపీకి బినామీగా ఉన్న పాల సహకార సొసైటీలపై దర్యాప్తు జరిపించాలని వైసీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
అనంతరం చర్చపై మాట్లాడిన సీఎం జగన్.. గతంలో చంద్రబాబు హయాంలో హెరిటేజ్ డెయిరీ కోసం సహకార డెయిరీలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. 1995లో చంద్రబాబు ప్రభుత్వం ఏపీ మ్యాక్స్ చట్టాన్ని తీసుకొచ్చిందని, అప్పటి వరకూ సహకార చట్టం పరిధిలో ఉన్న డెయిరీలన్నీ మ్యాక్స్ చట్టం పరిధిలోకి తీసుకొచ్చారన్నారు. అమూల్తో ఒప్పందంతో మహిళలకు మేలు జరుగుతుందని, పాల రైతులకు అదనంగా ఆదాయం వస్తుందని జగన్ చెప్పారు.