లాక్ డౌన్ అదనుగా రెచ్చిపోతున్న ఏపీ పోలీసులు.. వరుసగా సస్పెన్షన్లు, చర్యలు..
కరోనా వైరస్ మహమ్మారితో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ఏపీలో పోలీసులు మాత్రం చెలరేగిపోతున్నారు. అనుకున్నదే తడవుగా లాక్ డౌన్ పేరుతో చిన్నా చితకా వ్యాపారులను దోచుకుంటున్నారు. బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ప్రభుత్వం వీరిపై సీరియస్ అయింది. ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాల మేరకు వారం రోజుల వ్యవధిలోనే రెండు జిల్లాల పరిధిలో దాదాపు 20 మందికి పైగా కానిస్టేబుల్స్ పై చర్యలు తీసుకున్నారు.
విజయవాడలో లాక్ డౌన్ సందర్భంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్స్ మద్యం బాటిళ్లను అక్రమంగా రవాణా చేస్తూ దొరికిపోయారు. వీరిని సస్పెండ్ చేయాలని విజయవాడ కమిషనర్ ద్వారకాతిరుమల రావు ఆదేశాలు ఇచ్చారు. అయినా స్టేషన్ ఎస్సై పట్టించుకోలేదు. దీంతో ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది.
ఆ తర్వాత కృష్ణాజిల్లాలోని గంపలగూడెం, విస్సన్నపేటకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు అక్రమ మద్యం తరలింపుతో పాటు వ్యక్తుల వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేసిన ఘటనపై ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సీరియస్ అయ్యారు. ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.
తాజాగా గుంటూరు జిల్లాలోనూ ఇలాంటి వ్యవహారాలే తెరపైకి వచ్చాయి. జిల్లాలో లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ గుట్కా వ్యాపారులకు సహకరించడం ద్వారా అక్రమ రవాణాను ప్రోత్సహించడం, తోపుడు బండ్ల దగ్గర కాయలు తీసుకోవడం వంటి కారణాలపై ఏకంగా 17 మందిపై ఎస్పీ రామకృష్ణ సీరియస్ అయ్యారు. వీరందరినీ వీఆర్ కు పంపుతూ తాజాగా ఆదేశాలు ఇచ్చారు.