రెండేళ్ల కోసమే వస్తే వద్దు: తెలంగాణ వారికి ఏపీ షాక్, వారికి ఊరట
హైదరాబాద్: తెలంగాణ స్థానికులుగా ఉండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించబడిన ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చింది!
ఉద్యోగుల కేటాయింపు తర్వాత తాము తెలంగాణ వాళ్లం కాబట్టి ఏపీకి వెళ్లమనికమల్నాథన్ కమిటీకి లేఖలు రాసిన ఉద్యోగులు కొందరు... ఇప్పుడు ఏపీలో విధులు నిర్వహించేందుకు వరుస కడుతున్నారంటున్నారు.
తెలంగాణలో పదవీ విరమణ వయస్సు 58 ఏళ్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60 ఏళ్లు ఉంది. దీంతో, పలువురు తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులు మొదట ఏపీకి వెళ్లేందుకు ఇష్టపడలేదు. 60ఏళ్లుగా పదవీ విరమణ వయస్సు ఉండటంతో ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారంటున్నారు.
ముఖ్యంగా, పదవీ విరమణ గడువైన 58 ఏళ్లు దాటగానే ఏపీలో చేరేందుకు వరుస కడుతున్నారంటున్నారు. గడచిన మూడు నెలల వ్యవధిలో ఎంతో మంది ఉద్యోగులు ఏపీలో రిపోర్ట్ చేసి తమను కొనసాగించాలని కోరగా, ఇలా రెండేళ్ల సర్వీసు కోసం వస్తున్న వారిని తీసుకోరాదని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ తేల్చి చెప్పారు.
ఈ మేరకు ఆయన గురువారం నాడు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కేటాయించగానే విధుల్లో చేరిన తెలంగాణ ఉద్యోగులకు ఈ నిబంధన వర్తించదని, వారు రెండేళ్ల సర్వీసును ముగించుకోవచ్చని స్పష్టం చేశారు. అయితే, కేవలం రెండేళ్ల సర్వీసు కోసం వచ్చే వారికి మాత్రం షాకిస్తున్నారు. ఇప్పటికే ఉన్న వారికి మాత్రం శుభవార్త.