చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై దర్యాప్తు మీరు చేస్తారా? మమ్మల్ని చేయమంటారా?: జగన్ కు బీజేపీ ఆప్షన్
కర్నూలు: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై తక్షణమే దర్యాప్తు చేయాలని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి సునీల్ దేవ్ ధర్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఉపేక్షించే ప్రసక్తే ఉండకూడదని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తరువాత కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి చర్యలను చేపడుతున్నట్లు కనిపించట్లేదని విమర్శించారు. పోలవరం సహా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పలు ప్రాజెక్టులపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అన్నారు.
బీజేపీ చేపట్టిన గాంధీ సంకల్ప యాత్రలో భాగంగా గురువారం ఉదయం ఆయన కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ ఉదయం కర్నూలులో పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ను కలిశారు. ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం టీజీ వెంకటేష్ తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపణలకు మాత్రమే పరిమితం అవుతున్నారని, దాన్ని చేతల్లో చూపట్లేదని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై దర్యాప్తు మీరు చేస్తారా? లేక మమ్మల్ని చేయమంటారా? అని నిలదీశారు.
అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు కేంద్ర వద్ద కూడా ఆధారాలు ఉన్నాయని, వాటి ద్వారా త్వరలోనే కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. కేంద్రంతో విభేదించి తప్పు చేశామని, మరోసారి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తామంటూ చంద్రబాబు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారని, దీనివల్ల ఆయన మరోసారి యూటర్న్ రాజకీయాలకు తెర తీసినట్టు కనిపిస్తోందని సునీల్ దేవ్ ధర్ ఎద్దేవా చేశారు. అవినీతిలో పీకలదాకా కూరుకునిపోయిన చంద్రబాబుతో గానీ, ఆయన పార్టీతో గానీ పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదని పునరుద్ఘాటించారు.
చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి ఎప్పుడో ద్వారాలు మూసుకునిపోయాయని, ఇప్పుడు ఆయన ఎన్నిసార్లు తలుపు తట్టినా ఉపయోగం ఉండబోదని స్పష్టం చేశారు. అయిదేళ్ల ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతి కార్యక్రమాలపై విచారణను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న అనంతరం, ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేశారని, అవన్నీ తమ దృష్టికి వచ్చాయని అన్నారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నామని సునీల్ దేవ్ ధర్ చెప్పారు.