ఏపీలో అమూల్- టార్గెట్ చంద్రబాబు హెరిటేజ్- ప్రభుత్వ డెయిరీల బలోపేతమే లక్ష్యం....
ఏపీలో డెయిరీ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఇవాళ గుజరాత్ పాల ఉత్పత్తుల దిగ్గజం అమూల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. మన రాష్ట్రంలో ప్రభుత్వ డెయిరీలను బలోపేతం చేసేందుకు అమూల్ సహకారం తీసుకునేందుకు వీలుగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇప్పటికే విద్యా, వైద్య రంగాల్లో ప్రభుత్వ సంస్ధలను బలోపేతం చేస్తున్న జగన్ సర్కార్.. పాల ఉత్పత్తిలోనూ హెరిటేజ్ వంటి ప్రైవేటు సంస్ధలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకుందనే వాదన వినిపిస్తోంది. అంతిమంగా రాష్ట్రంలో రైతులకు మేలు జరిగేలా ఈ ఒప్పందం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.
అమూల్ తో ఒప్పందం...
గుజరాత్ కు చెందిన సహకార దిగ్గజం అమూల్ సాయంతో ఏపీలో ప్రభుత్వ డెయిరీలను బలోపేతం చేసే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఇవాళ ఓ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర పారిశ్రామిక రంగంలోనే దీన్ని ఓ మైలురాయిగా ప్రభుత్వం చెబుతోంది. సీఎం జగన్ సమక్షంలో ఎంఓయూ ఒప్పందంపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్ చెన్నై జోనల్ హెడ్ రాజన్ సంతకాలు చేశారు. అదే సమయంలో గుజరాత్ లోని అమూల్ స్వస్ధలం ఆనంద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్య ఎండీ ఆర్.ఎస్.సోధి, సబర్కాంత జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్ ఛైర్మన్ సంబల్ భాయ్ పటేల్ తో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
మహిళల జీవితాల్లో మార్పు....
అమూల్ తో ఒప్పందం తర్వాత మాట్లాడిన సీఎం జగన్ మహిళల జీవితాల్లో ఇదో గొప్ప ముందడుగు అవుతుందన్నారు. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాల కింద మహిళలకు నాలుగేళ్లలో రూ.44 వేల కోట్లు ఖర్చు చేస్తామని, ఈ సహాయం వారి జీవితాలు మార్చేందుకు ఉపయోగపడాలని జగన్ ఆకాంక్షించారు. అమూల్ భాగస్వామ్యంతో మహిళలకు మరింత చేదోడు లభిస్తుందని జగన్ తెలిపారు. ఈ ఒప్పందంతో ప్రభుత్వ సహకార డెయిరీలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు గేట్ వేగా ఆంధ్రప్రదేశ్ మారుతోందన్నారు. అమూల్ ఒప్పందంతో పాడి పరిశ్రమ అభివృద్ధి, రైతులకు మంచి ధరలు, వినియోగదారులకు సరసమైన ధరలు కల్పించడమే లక్ష్యమని సీఎం జగన్ వెల్లడించారు.
అంతర్జాతీయ మార్కెటింగ్ సహకారం...
అమూల్ ఒప్పందంతో ఏపీలోని ప్రభుత్వ డెయిరీలకు అంతర్జాతీయ స్ధాయి మౌలిక సదుపాయాలతో పాటు మార్కెటింగ్ అవకాశాలు లభించనున్నాయి. ఇందులో వాడే టెక్నాలజీతో పాడి పశువుల పెంపకం, డెయిరీల నిర్వహణ పరిజ్ఞానం, సహకార సంఘాల్లో మహిళలకు అపార అవకాశాలు లభిస్తాయని సీఎం జగన్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో పాల ఉత్పత్తిలో ఏపీ నాలుగో స్ధానంలో ఉంది. కానీ 24 శాతం పాలు మాత్రమే వ్యవస్ధీకృత రంగానికి వెళ్తున్నాయని సీఎం తెలిపారు. దీంతో పాల రైతులు నష్టపోతున్నారని, వారి కష్టానికి తగిన ధర లభించడం లేదన్నారు. గత ప్రభుత్వం వారి సొంత సంస్ధ హెరిటేజ్ కోసం ప్రభుత్వ డెయిరీలు నాశనం చేసిందని జగన్ ఆక్షేపించారు. రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాల్లో త్వరలో పాలసేకరణ కేంద్రాలు పెడతామని, అక్కడ ఉంటే వెటర్నరీ, అగ్రికల్చర్ అసిస్టెంట్లు రైతులకు అవసరమైన సాయం అందిస్తారని జగన్ తెలిపారు.
Recommended Video
అమూల్ తో హెరిటేజ్ కు చెక్...
అమూల్ రాకతో ప్రభుత్వ డెయిరీలు బలోపేతం చేస్తామని ఏపీ సర్కార్ చెబుతోంది. అదే సమయంలో ప్రైవేట్ రంగంలో ఇప్పటికే రాజ్యమేలుతున్న హెరిటేజ్ వంటి సంస్ధలకు కష్టాలు మొదలైనట్లే అనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే ప్రభుత్వ రంగంలోని విద్యా సంస్ధలు, ఆస్పత్రుల రూపురేఖలను నాడు-నేడు ద్వారా మారుస్తున్న జగన్ సర్కార్.. ఇప్పుడు అదే వ్యూహాన్ని సహకార పాల ఉత్పత్తి రంగంలోనూ అమలు చేయబోతోంది. ఇందుకు అమూల్ సాయం తీసుకోనుంది. అమూల్ రాకతో ప్రైవేటు రంగంలోని హెరిటేజ్ తో పాటు ఇతర డెయిరీలు నష్టపోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ డెయిరీలకు విదేశీ పరిజ్ఞానం, మార్గెటింగ్ అవకాశాలను ప్రభుత్వమే ప్రోత్సహించడం వల్ల ప్రైవేటు రంగంలోని డెయిరీలకు ఆ మేరకు కష్టాలు తప్పవకపోవచ్చని తెలుస్తోంది.