వరద బాధితులకు జగన్ సర్కార్ బాసట: ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీకి ఆదేశం
ఏపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదల కారణంగా దెబ్బతిన్న కుటుంబాలకు అండగా నిలవాలని మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిన్నటికి నిన్న భారీ వర్షాలు వరదల నేపథ్యంలో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర మంత్రి అమిత్ షా కు లేఖ రాసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి తక్షణమే 2250 కోట్ల రూపాయలు సాయం చేయాలని, వరద నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలని కోరిన విషయం తెలిసిందే.
ఏపీలో వరద బాధితులకు ఉచిత నిత్యావసరాలు
తాజాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు ,వరదలకు నిరాశ్రయులైన వారికోసం ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీకి ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో తాజాగా గోదావరి, కృష్ణానది వరదల నేపథ్యంలో కృష్ణా, గుంటూరు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు నీటమునిగాయి. తీవ్ర పంట నష్టంతో పాటుగా, ఆస్తి నష్టం జరిగింది. ఊళ్లకు ఊళ్లే జలదిగ్బంధంలో చిక్కుకుని ప్రజలు నిరాశ్రయులయ్యారు.
నాలుగు జిల్లాల కలెక్టర్లకు ఏపీ ప్రభుత్వ ఆదేశాలు
ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను కొనసాగిస్తున్న ఏపీ సర్కార్, వారానికి పైగా వరద ముంపుకు గురైన ప్రాంతాలలో ఉచిత సరుకులు పంపిణీ చెయ్యాలని ఆదేశించింది. ఈ మేరకు కృష్ణా గుంటూరు పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది సర్కార్. దీంతో ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంపలు ఇవ్వనున్నట్లుగా పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల సరఫరాకు సంబంధించి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారిక ఉత్తర్వులు స్పష్టం చేశారు.
ఏపీలో భారీ వర్షాలు .. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ చర్యలు
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. తాజాగా కూడా మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. వర్షాల కారణంగా దెబ్బతిన్న కుటుంబాలకు సాయం అందించడంతో పాటుగా ముంపు ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టింది. గత వారం పది రోజులుగా కురుస్తున్న వర్షాలు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వానికి ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి.