సీఎం జగన్ పై అసభ్య పోస్టులు- గుంటూరు డీసీసీబీ ఉద్యోగిని మాధవి సస్పెన్షన్
ఏపీలో సీఎం జగన్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల వ్యవహారం మరింత ముదురుతోంది. ఇప్పటికే సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పలువురు ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలపై సీఐడీ కేసులు నమోదు చేసినా, పలు హెచ్చరికలు చేస్తున్నా పోస్టుల పరంపర ఆగడం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో మరో ఉద్యోగిని సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెండ్ అయ్యారు.
రెండో విడత వైఎస్సార్ వాహనమిత్ర .. ప్రారంభించిన సీఎం జగన్.. ఆటో,ట్యాక్సీవాలాల ఖాతాలకు రూ.10వేలు
గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పనిచేస్తున్న మాధవి వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆమె డీసీసీబీ ఉద్యోగి అని ఎవరికీ తెలియలేదు. అయితే ఆమె పోస్టులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ మహిళా విభాగం నేతలు గుంటూరు అరండల్ పేట్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే విచారణ జరిపిన పోలీసులకు మాధవి డీసీసీబీ ఉద్యోగినిగా తేలింది. పోలీసుల నుంచి సమాచారం అందుకున్న డీసీసీబీ సీఈవో సుబ్రహ్మణ్యేశ్వరరావు మాధవిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
ఇప్పటికే సీఎం జగన్పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయవాడ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ డీఈఈ విద్యాసాగర్, టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రంగనాయకి, మల్లాడి రఘునాధ్ తో పాటు మరో నలుగురిపై సీఐడీ విచారణ జరుపుతోంది. తాజాగా మాధవి కేసును కూడా పోలీసులు సీఐడీకి బదిలీ చేయనున్నారు. ఇందులో ఆమె దోషిగా తేలితే ఐదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.