టీడీపీ ఎంపీ గల్లా కుటుంబానికి జగన్ సర్కార్ షాక్- అమర్ రాజా ఇన్ ప్రా భూములు వెనక్కి...
గతేడాది ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వాల హయాంలో భూములు పొందిన పలువురు టీడీపీ నేతలకు షాకులు ఇచ్చుకుంటూ వస్తున్న జగన్ సర్కార్ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. గతంలో చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమర్ రాజా ఇన్ ఫ్రా సంస్ధకు 2009 లో కేటాయించిన భూముల్లో సగానికి పైగా వెనక్కి తీసుకుంది.
2009లో అప్పటి రోశయ్య ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి గల్లా అరుణకుమార్ కుటుంబానికి చెందిన అమర్ రాజా ఇన్ ఫ్రా సంస్ధకు 483.27 ఎకరాల భూమిని డిజిటల్ వరల్డ్ సిటీ నిర్మాణానికి కేటాయించారు.
పదేళ్లు పూర్తవుతున్నా కాంట్రాక్టు నిబందనల ప్రకారం ఉద్యోగాలు కల్పించకపోవడంతో ఈ భూమిలో 253.61 ఎకరాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఇవాళ ఏపీ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగాల కల్పన లేకపోవడంతో పాటు సంస్ధ విస్తరణ కూడా చేపట్టకపోవడంతో ఈ భూములు వెనక్కి తీసుక్కోవాలని ఏపీఐఐసీకి జారీ చేసిన ఆదేశాల్లో పరిశ్రమల శాఖ పేర్కొంది.
ఇప్పటికే టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేటాయించిన పలు భూ కేటాయింపులను వైసీపీ సర్కారు రద్దు చేసింది. తాజాగా చిత్తూరు జిల్లా కొత్తపల్లి, నూనె గుండ్లపల్లి గ్రామాల్లో అమర్ రాజా ఇన్ ఫ్రా భూములను కూడా స్వాధీనం చేసుకోనుండటంతో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. టీడీపీ నేతలను వైసీపీలో చేర్చుకునేందుకు ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని చంద్రబాబు ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ తాజా ఉత్తర్వులు కలకలం రేపాయి.