కాలపరిమితి ముగిసింది: 'సరస్వతి'కి చంద్రబాబు షాక్
హైదరాబాద్: గుంటూరు జిల్లాలో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రయివేటు లిమిటెడ్కు కేటాయించిన భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తీసుకోనుంది. సరస్వతి కంపెనీకి ఇచ్చిన కాలపరిమితి ముగిసిందని ప్రభుత్వం గురువారం ఓ జీవోను విడుదల చేసింది. ప్రభుత్వం 98వ నెంబర్ జీవోను విడుదల చేసింది. కాలపరిమితి ముగిసిందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.
గుంటూరు జిల్లాలో 613 ఎకరాల భూమిని 2009లో నాటి ప్రభుత్వం మైనింగ్ లీజు కోసం సరస్వతి కంపెనీకి ఇచ్చింది. అయితే, ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి పనులు ప్రారంభించలేదని, లీజు కాలపరిమితి ముగిసిందని ప్రభుత్వం పేర్కొంది. రేపో, ఎల్లుండో భూమిని వెనక్కి తీసుకునే ఉత్తర్వులు కూడా రావొచ్చని భావిస్తున్నారు.
ఇంతకాలం భూమిని నిరుపయోగంగా ఉంచినందున కాలపరిమిది ముగిసిందని ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. మాచవరం, చెన్నాయపాలెం తదితర ప్రాంతాల్లో నాటి ప్రభుత్వం సరస్వతి కంపెనీకి ఈ భూమిని ఇచ్చింది.
కాగా, సరస్వతి ప్లాంటుకు కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకుంటామని ఎమ్మెల్యే యరపతినేని బుధవారం చెప్పారు. గుంటూరు జిల్లా మాచవరం మండలె చెన్నాయపాలెంలో కొందరు ట్రాక్టర్లతో దున్నించిన పత్తి పంటను బుధవారం యరపతనేని పరిశీలించారు. రైతులను ఓదార్చారు.
ఈ సందర్భంగా సరస్వతికి కేటాయించిన భూములను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. గురువారం మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు, కలెక్టర్ కాంతిలాల్ దండేలు పంటను నాశనం చేసిన ప్రాంతాలన్ని పరిశీలించారు.