పోలవరం నిర్మాణంపై వేగం పెంచుతున్న ఏపీ ప్రభుత్వం .. నేడు మంత్రి అనీల్ పోలవరం పర్యటన
ఏపీ ప్రభుత్వం ఒక పక్క కరోనాతో పోరాట సాగిస్తూనే మరోపక్క అన్ని కార్యాకలాపాలు సజావుగా సాగే విధంగా దృష్టి పెట్టింది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టిన ఏపీ సర్కార్ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జగన్ ఇచ్చిన మాట మేరకు పూర్తి చెయ్యాలని భావిస్తుంది. అందుకే పనుల్లో వేగం పెంచింది. సంచలనాలకు కేరాఫ్ అయిన సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కూడా చాలా సీరియస్ గా ఉన్నారు .
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పై అధికారులకు డెడ్ లైన్ పెట్టిన జగన్ ... ఏం చెప్పారంటే
పోలవరం ప్రాజెక్టు పనులను 2021లోగా పూర్తి చెయ్యాలని టార్గెట్
పోలవరం నిర్మాణంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను 2021 నాటికి పూర్తి చేసి రైతాంగానికి సాగు నీరు అందిస్తానని అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చిన సీఎం జగన్ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే వచ్చే జూన్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయాల్సిందేనని ఇప్పటికే తేల్చి చెప్పారు. సీఎం జగన్ జల వనరుల శాఖ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు.
జులై లోగా పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని నిర్ణయం
ఒకపక్క కరోనా లాక్ డౌన్ సమయంలో ఆగిన పోలవరం నిర్మాణ పనులు, ఇప్పుడిప్పుడే మళ్ళీ లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో కొనసాగుతున్నాయి. ఇప్పుడు పనులు ఆగటానికి వీల్లేదని, సిమెంట్ , స్టీల్ కొరత లేకుండా చూడాలని అధికారులకు దిశా నిర్దేశం చేసిన సీఎం జగన్ కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు వరదలు వచ్చేలోగా అంటే జూలైలోగా పునరావాసం కల్పించాలని పేర్కొనారు. ఇక దీని కోసం అవసరమైన అన్ని పనులు పూర్తి చేస్తున్నారు.
పోలవరం నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ రూ.79 కోట్లు
ఇక దీని కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరం నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ రూ.79 కోట్లు కేటాయించారు. నిర్వాసితులు సంతోషంగా ఉంటేనే ప్రాజెక్టు నిర్మాణం ముందుకు వెళుతుందనే ఉద్దేశంతో సీఎం తొలి విడత ప్యాకేజీ ప్రకటించి వారికి పునరావాసం కల్పించాలని అధికారులను ఆదేశించారు . ఈ నేపథ్యంలో నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కారానికి జలవనరులశాఖా మంత్రి అనిల్కుమార్ యాదవ్ నేడు పోలవరంలో పర్యటించనున్నారు .
రెండు రోజులపారు మంత్రి పర్యటన .. పోలవరం పనులపై సమీక్ష
తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో మంత్రి అనిల్ కుమార్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇవాళ, రేపు పోలవరంలో ఇరిగేషన్ పనులను మంత్రి పరిశీలించనున్నారు. అనంతరం పోలవరం మరియు ఆర్ అండ్ బీ పనులపై స్థానిక నేతలు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే గ్రామాల్లో మంత్రి పర్యటించి అక్కడి ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు. అలాగే ఆర్ అండ్ ఆర్ కాలనీ సందర్శించి ఇళ్ళు నిర్మాణాలను మంత్రి అనిల్ కుమార్ పరిశీలించనున్నారు. పోలవరం నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చెయ్యటానికి సీఎం జగన్ ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖా మంత్రి అనీల్ కుమార్ యాదవ్ రంగంలోకి దిగుతున్నారు.