హైకోర్టు తీర్పుపై సుప్రీంకు జగన్ సర్కార్- ఇవాళ పిటిషన్ - కేరళ సీన్ రిపీట్ ?
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వంలో ప్రకంపనలు రేపుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను సాకుగా చూపుతూ ఎన్నికలు వాయిదా వేయించాలన్న సర్కారు ప్రయత్నం నెరవేరకపోవడంతో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి శరాఘాతంగా మారింది. హైకోర్టు తీర్పు, ఎస్ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎల్లుండి నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఎన్నికలను ఎలాగైనా అడ్డుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తోంది. అయితే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న వైసీపీ సర్కారుకు కేరళ గత అనుభవాలు వెంటాడుతున్నాయి.
Recommended Video
జగన్ సర్కారుకు భారీఝలక్- పంచాయతీ పోరుకు హైకోర్టు గ్రీన్సిగ్నల్- నెగ్గిన నిమ్మగడ్డ వాదన
హైకోర్టు తీర్పుపై సుప్రీంకు జగన్ సర్కార్
ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి భారీ షాక్గా మారింది. వ్యాక్సినేషన్ కారణంగా ఎన్నికలు కచ్చితంగా వాయిదా పడతాయని గంపెడాశతో ఉన్న ప్రభుత్వం హైకోర్టు తీర్పుతో చిక్కుల్లో పడింది. ఎల్లుండి నుంచి పంచాయతీ పోరు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ పిటిషన్ దాఖలుకు సన్నాహాలు చేస్తోంది. రేపు విచారణ జరిగి ఎన్నికలకు బ్రేక్ వేయించాలనే లక్ష్యంతో సర్కారు పావులు కదుపుతోంది. ఈ మేరకు ఉన్నతాధికారులు, మంత్రులతో జగన్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
వ్యాక్సినేషన్ వేళ కుదరదంటూ..
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం హైకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా ఏపీలో కరోనా వ్యాక్సినేషన్పై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లబోతోంది. అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను ఏపీలో మాత్రం ఎన్నికల పేరుతో అడ్డుకోవడం సరికాదని వాదించనుంది. ఇప్పటికే రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొంటున్న ఉద్యోగులు ఎన్నికలు వద్దంటూ పిటిషన్లు దాఖలు చేశారని, వాటిని పట్టించుకోకుండా హైకోర్టు తీర్పు ఇచ్చిందని ప్రభుత్వం పేర్కొనే అవకాశముంది. ఉద్యోగులతో పాటు అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్న ఈ ఎన్నికలను ప్రస్తుతానికి వాయిదా వేయడమే మంచిదని ప్రభుత్వం కోరనుంది.
కేరళ ఎన్నికలపై సుప్రీం ఏం చెప్పింది ?
కేరళలో స్ధానిక సంస్ధలను వాయిదా వేయాలని కోరుతూ ఏపీ తరహాలోనే ఆ రాష్ట్ర ఎమ్మెల్యే పీసీ జార్జ్ గత నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ను విచారణకు అనుమతించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఓసారి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించాక ఎన్నికల ప్రక్రియ వాయిదాకు అనుమతించలేమని అప్పట్లో సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో కేరళలో స్ధానిక సంస్ధల ఎన్నికలన్నీ షెడ్యూల్ ప్రకారమే నిర్వహించడమే కాకుండా డిసెంబర్ 16న ఫలితాలు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా పంచాయతీ పోరుపై ఇదే తీర్పు వస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది.