రమేష్ ఆస్పత్రిపై సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్- హైకోర్టు తీర్పుపై త్వరలో పిటిషన్...
విజయవాడలో తీవ్ర కలకలం రేపిన స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు కారణంగా పోలీసులు పేర్కొంటున్న రమేష్ ఆస్పత్రి విషయంలో తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. అగ్నిప్రమాదానికి రమేష్ ఆస్పత్రికి బాధ్యత లేదన్నట్టుగా హైకోర్టు తీర్పు ఉందని భావిస్తున్న ప్రభుత్వం దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించింది.
స్వర్ణప్యాలెస్ ఘటనలో రమేష్ ఆస్పత్రికి చెందిన ముగ్గురు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆస్పత్రి ఎండీ రమేష్ బాబు పరారైనట్లు పోలీసులు ప్రకటించారు. ఆ తర్వాత హైకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. రమేష్ ఆస్పత్రిపై చర్యలు తీసుకునే ముందు స్వర్ణప్యాలెస్లో కోవిడ్ సెంటర్కు అనుమతిచ్చిన అధికారులను ఎందుకు బాధ్యులు చేయరంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చివరికి రమేష్ ఆస్పత్రి ఎండీతో పాటు ఆస్పత్రిపైనా తదుపరి చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇచ్చింది.
హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయకపోతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని భావిస్తున్న ప్రభుత్వం.. త్వరలో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కసరత్తు జరుగుతోంది. హైకోర్టు తీర్పును అమలు చేస్తే నిందితులు తప్పించుకునే వీలుందని పేర్కొంటూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయబోతోంది. అయితే ఇప్పటికే రాజకీయం, కులాల రంగు పులుముకున్న ఈ కేసులో సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసే పిటిషన్ మరింత చర్చకు మాత్రం అవకాశం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.