మాన్సాస్ తీర్పుపై అప్పీలు లేనట్లే ? తెరపైకి పాత అక్రమాలు- పట్టుబిగిస్తున్న అశోక్
విజయనగరం జిల్లాలోని పూసపాటి రాజవంశీకులకు చెందిన మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ నియామకం విషయంలో నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు మాజీ ఛైర్మన్ అశోక్గజపతిరాజు తిరిగి పుంజుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో ఆయన ట్రస్టుపై పట్టు బిగించేందుకు పావులు కదుపుతున్నారు. అదే సమయంలో హైకోర్టు తీర్పుతో ఛైర్పర్సన్ పదవి కోల్పోయిన సంచైత గజపతిరాజుతో పాటు ప్రభుత్వం కూడా తదుపరి అడుగులపై డైలమాలో ఉన్నారు. అప్పీలు సాధ్యం కాకపోతే మాన్సాస్ అక్రమాల వెలికితీతపై సర్కారు దృష్టిపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
మాన్సాస్పై పట్టుకు అశోక్ అడుగులు
గతంలో అన్న ఆనందగజపతిరాజు మరణం తర్వాత మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్గా వారసత్వ బాధ్యతలు చేపట్టిన అశోక్గజపతిరాజు ఊహించిన పరిణామాలతో గతేడాది ఆ పదవి కోల్పోయారు. ఆ తర్వాత న్యాయపోరాటంతో తిరిగి పదవి దక్కించుకున్న అశోక్.. ఇప్పుడు తిరిగి మాన్సాస్పై పట్టు బిగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మాన్సాస్తో పాటు సింహాచలం ట్రస్టు బోర్డు ఛైర్మన్ పదవి కూడా దక్కించుకున్న అశోక్ ఇవాళ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. అదే సమయంలో మాన్సాస్లో తిరిగి పాత నిర్ణయాల పునరుద్ధరణకు ఆయన పావులు కదుపుతున్నారు.
హైకోర్టు తీర్పు అప్పీలుపై సర్కార్ డైలమా
మాన్సాస్తో పాటు సింహాచలం బోర్డు ఛైర్మన్ పదవుల్లో వారసత్వ ధర్మకర్త అశోక్గజపతిరాజునే తిరిగి నియమించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వంలో కలకలం రేపాయి. ఇన్నాళ్లూ దేవాదాయశాఖ తమ చేతుల్లో ఉండటంతో తమ నిర్ణయాలే చెల్లుబాటు అవుతాయని భావించిన ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు షాకిచ్చింది. దీంతో ఇప్పుడు మాన్సాస్, సింహాచలం బోర్డులపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తామని ముందుగా ప్రకటించిన ప్రభుత్వం తాజాగా రూటు మార్చింది.
మాన్సాస్ అక్రమాల వెలికితీత
మాన్సాస్పై హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లినా సానుకూల తీర్పు రావడం కష్టమేనని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాన్సాస్లో చోటు చేసుకున్న పరిణామాలపై ప్రభుత్వం దృష్టిపెడుతోంది. అశోక్ హయాంలో మాన్సాస్ అక్రమాలపై దృష్టిపెడతామని దేవాదాయమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన తాజా ప్రకటన దీనికి అద్దం పడుతోంది. అప్పీలుకు వెళ్లే పక్షంలో తీర్పుపై దృష్టిపెట్టాల్సింది పోయి అశోక్ హయాంలో అక్రమాల్ని వెలికితీస్తామంటూ మంత్రి చేసిన ప్రకటనతో అక్కడ భవిష్యత్తులో ఏం జరగబోతోందో తేలిపోతోంది.
హైకోర్టు తీర్పుపై సంచైత మౌనం
వైసీపీ సర్కారు చలవతో మాన్సాస్, సింహాచలం బోర్డుల ఛైర్పర్సన్గా రాత్రికి రాత్రి నియమితురాలైన సంచైత గజపతిరాజు ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పదవీచ్యుతురాలు కానున్నారు. అయితే హైకోర్టు తీర్పు ఆమెకు కూడా భారీ షాకిచ్చింది. దీంతో ఆమె హైకోర్టు తీర్పుపై స్పందించేందుకు ఇష్టపడటం లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సంచైత ఇప్పుడు హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తానని కానీ, అక్రమాల్ని ప్రశ్నిస్తానని కానీ చెప్పడం లేదు. దీంతో ఇక బాబాయ్ అశోక్ గజపతిరాజుకు పగ్గాలు అప్పగించి మాన్సాస్ నుంచి వెనుదిరగడమే ఇక తరువాయి అన్న ప్రచారం జరుగుతోంది.
Recommended Video