ఎండ వేడి, రాష్ట్రవ్యాప్తంగా మజ్జిగ సరఫరా: చంద్రబాబు నిర్ణయం
విజయవాడ: తీవ్ర ఎండ నేపథ్యంలో నివారణ చర్యలపై ఏపీ కేబినెట్ సోమవారం నాడు చర్చించింది. వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
ప్రజల దాహం తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మజ్జిగ ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ ఆస్పత్రులు, జన సమ్మర్ద ప్రాంతాల్లో మజ్జిగ పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం జిల్లాకు రూ.3కోట్లు చొప్పున కేటాయించనున్నారు.
వేసవి కాలం ముగిసే వరకు 45 రోజుల పాటు మజ్జిగ పంపిణీ చేయనున్నారు. నిరుపయోగంగా రక్షిత మంచినీటి పథకాల పునరుద్ధరణకు రూ.200 కోట్లు కేటాయించారు. వడగాడ్పుల మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించే అంశంపై చర్చించారు.
ఏపీ కేబినెట్ నిర్ణయాలు..
పీహెచ్సీలు, హెల్త్ సెంటర్ల పెంపునకు ఆమోదం. టూరిజం ప్రాజెక్టులకు భూకేటాయింపు విధానానికి ఆమోదం. టూరిజం ప్రాజెక్టులకు 35 ఏళ్లపాటు లీజుపై భూకేటాయింపులు. రక్షిత మంచి నీటి పథకాల మరమ్మతుకు రూ.200 కోట్ల కేటాయింపు. 540 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా. అవసరమైన చోటుకు ముందుగానే నీటిని తరలించి ట్యాంకర్ల ద్వారా సరఫరా. జనసమ్మర్దం ఉండే ప్రాంతాల్లో మజ్జిగ సరఫరా. రాష్ట్రంలో 193 హెల్త్ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం.