ఏపీ సర్కారు కీలక నిర్ణయం- ఉచిత విద్యుత్కూ మీటర్లు- అప్పుల సంస్కరణల్లో భాగంగా...
ఏపీలో ఉచిత విద్యుత్ విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రైతులకు ఉచిత విద్యుత్ను ఎలాంటి షరతుల్లేకుండా ఇవ్వాలన్న తన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశయానికి సీఎం జగన్ స్వయంగా తూట్లు పొడిచేలా ఉన్న ఈ నిర్ణయం రైతుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఉచిత విద్యుత్ కనెక్షన్లకూ సాధారణ కనెక్షన్ల తరహాలో మీటర్లు బిగించడం ద్వారా వాటికీ బిల్లింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ బిల్లు మొత్తాలను తిరిగి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అప్పుల కోసం ప్రపంచ బ్యాంకుతో పాటు ఇతర ఆర్ధిక సంస్ధలు విధిస్తున్న షరతుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉచిత విద్యుత్పై మీటర్ల పిడుగు..
ఏపీలో ఉచిత విద్యుత్ కోసం 2004 కంటే ముందు అప్పటి విపక్ష నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి అలుపెరగని పోరాటం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు. ప్రత్యర్ధి టీడీపీ ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని ఎగతాళి చేసినా లెక్క చేయలేదు. చివరికి ఉచిత విద్యుత్ హామీ విజయవంతంగా అమలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఉచిత విద్యుత్ మాత్రం అమలు చేయక తప్పని పరిస్ధితి. నాటి వైఎస్ ఆశయం ఉచిత విద్యుత్ మాత్రమే కాదు బేషరతుగా ఉచిత విద్యుత్. కానీ ప్రస్తుత జగన్ ప్రభుత్వం మాత్రం ఉచిత విద్యుత్కు మీటర్లు బిగించాలని నిర్ణయించింది. అంటే సాధారణ కనెక్షన్ల తరహాలోనే వీటికీ బిల్లులు వస్తాయన్నమాట. కానీ ఈ బిల్లు మొత్తాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రీయింబర్స్మెంట్ చేస్తుంది.
రైతుల్లో ఆందోళన...
వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఉచిత కనెక్షన్లకూ మీటర్ల బిగింపు నిర్ణయంపై రైతుల్లో అప్పుడే ఆందోళన మొదలైంది. గతంలో తండ్రి వైఎస్ హయాంలో బేషరతుగా ఇచ్చిన ఉచిత విద్యుత్ను ఆయన తనయుడు జగన్ షరతులతో అమలు చేయాలని భావించడమేంటనే ప్రశ్న రైతుల్లో తలెత్తుతోంది. ఎలాంటి షరతుల్లేకుండా ఉచిత విద్యుత్ ఇస్తుంటేనే పలుచోట్ల సమస్యలు తప్పడం లేదు. అధికారుల అలసత్వంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. అలాంటిది ఇప్పుడు మీటర్లను బిగించడం మొదలుపెడితే వాటి బిల్లులు, వాటిలో తేడాలు, వాటి రీయింబర్స్మెంట్ ఎళాంటి సమస్యలు లేకుండా సాఫీగా సాగిపోతుందని ఎలా భావిస్తామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి విధివిధానాలు వచ్చాక దీనిపై స్పందిస్తామని రైతుసంఘాలు చెబుతున్నాయి.
విద్యుత్ మీటర్లపై విపక్షాల ఫైర్...
దివంగత సీఎం వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పాడేందుకే సీఎం జగన్ మీటర్ల బిగింపు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని విపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. దశల వారీగా 18 లక్షళ వ్యవసాయదారుల నోట్లో మట్టి కొట్టేందుకే ప్రభుత్వం ఈ జీవోలు తీసుకొస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలకు ఏపీ ప్రభుత్వం గుడ్డిగా మద్దతిస్తోందని, రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కోసం మీటర్లు బిగించాల్సిన అవసరం ఏమొచ్చిందని రామకృష్ణ ప్రశ్నించారు. రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాల్సిన అగత్యమెందుకన్నారు. ప్రభుత్వం నేరుగా విద్యుత్ సంస్ధలకు బిల్లులు చెల్లించకూడదా అని ఆయన ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ నుంచి దశల వారీగా తప్పుకునేందుకే నగదు బదిలీ కుట్రకు తెరలేపారని రామకృష్ణ విమర్శించారు.
Recommended Video
అప్పుల కోసమే మీటర్లు...
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో సంస్కరణలకు తీవ్రంగా పట్టుబడుతోంది. ఓవైపు దేశంలో చౌక విద్యుత్ దొరుకుతున్నా పీపీఏల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయ్యే్ ఒప్పందాలను అమలు చేయాల్సిందేనని పట్టుబడుతున్న కేంద్రం... మరోవైపు సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలను కట్టడి చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అప్పులు కావాలంటే తాము కోరిన విధంగా విద్యుత్ సంస్కరణలను అమలు చేయాల్సిందేనని కేంద్రం చెబుతోంది. దాదాపు ప్రపంచబ్యాంక్ కూడా ఇదే విషయాన్ని చెప్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కుప్పలు తెప్పలుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అప్పుల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని తెలుస్తోంది. అయితే గతంలో ఇలాంటి సంస్కరణలను జగన్ తండ్రి వైఎస్ వ్యతిరేకించగా.. ఇప్పుడు ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నామని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం తిరిగి వాటినే తెరపైకి తీసుకురావడం దుమారం రేపుతోంది.