నవంబర్ 2 నుంచే ఏపీ స్కూళ్లు, కాలేజీలు- దశలవారీగా తరగతులు- ఏ క్లాసుకు ఎప్పుడో తెలుసా ?
ఏపీలో కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలను నవంబర్ 2 నుంచి ఎట్టిపరిస్ధితుల్లోనూ ప్రారంభించించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విడతల వారీగా తరగతులు ప్రారంభమవుతాయి. కేంద్రం అన్లాక్ 5 నిబంధనల సవరింపుతో గతంలో విధించిన ఆంక్షలను నవంబర్ 30 వరకూ పొడిగించిన నేపథ్యంలో తాము మాత్రం విద్యాసంస్ధలు నవంబర్ 2 నుంచి పునఃప్రారంభిస్తామని ప్రభుత్వం ఇవాళ మరోసారి స్పష్టం చేసింద
ఏపీలో విద్యాసంస్ధల పునఃప్రారంభంపై గతంలో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. వీటి ప్రకారం నవంబర్ 2 నుంచి అన్ని పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. రోజు విడిచి రోజు విధానంలో తరగతులు నిర్వహిస్తారు. అలాగే మధ్యాహ్నం వరకూ మాత్రమే విద్యాసంస్ధలు పనిచేసేలా ఆదేశాలు ఇచ్చారు. కోవిడ్ వ్యాపించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ మేరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ను విడుదల చేశారు.

ఏపీలో ప్రభుత్వం విడుదల చేసిన కొత్త షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2 నుంచి 9,10 క్లాసులతో పాటు ఇంటర్ తరగతులు ప్రారంభమవుతాయి. ఇంటర్, డిగ్రీ కాలేజీలు కూడా ఇదే రోజు ప్రారంభమవుతాయి. నవంబర్ 23 నుంచి 6,7,8 క్లాసులు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 14 నుంచి 1,2,3,4,5 తరగతులను ప్రారంభిస్తారు. రాష్ట్రంలో విద్యాసంస్ధలన్నీ రోజు విడిచి రోజు విధానంలో ఒంటిపూట మాత్రమే క్లాసులు నిర్విహంచాల్సి ఉంటుంది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థలకు అన్నింటికీ కూడా ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.