జనవరి 1 నుంచి ఏపీలో భూముల సర్వే- మూడేళ్ల మహాయజ్ఞం- ఏర్పాట్లకు జగన్ ఆదేశం..
ఏపీలో గతేడాది అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం భూముల రీసర్వే కోసం చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయి. సర్వేయర్ల కొరతతో పాటు ఇతరత్రా కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ సమగ్ర సర్వేను వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించేందుకు సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. సమగ్ర సర్వే కోసం చేయాల్సిన ఏర్పాట్లపైనా స్పష్టమైన సూచనలు చేశారు. దీంతో సర్వే ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేయబోతున్నారు.
సీఎం జగన్ ఆదేశాల మేరకు వచ్చే ఏడాది జనవరి 1న ఏపీలో సమగ్ర భూసర్వే ప్రారంభమవుతుంది. ఈ సర్వే 2023 ఆగస్టులో పూర్తవుతుంది. రూరల్తో పాటు అర్బన్ ప్రాంతాల్లోనూ సమగ్ర భూసర్వే నిర్వహిస్తారు. వీటిలో భారీ ఎత్తున రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు పాల్గొంటారు. సర్వేయర్లతో పాటు ఎమ్మార్వోలు, ఇతర అధికారులు క్షేత్రస్ధాయిలో రంగంలో ఉంటారు. అర్బన్ ప్రాంతాల్లోనూ సర్వే చేపట్టేందుకు వీలుగా భారీగా సర్వేయర్లను ప్రభుత్వం రంగంలోకి దింపుతోంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న వారితో పాటు ఔట్ సోర్సింగ్ ద్వారా వీరి నియామకాలు కూడా ఉఁటాయి.
భూ సర్వేలో తలెత్తే వివాదాల పరిష్కారానికి ఎక్కడికక్కడ మొబైల్ ట్రైబ్యునల్స్ను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. వీటి ద్వారా ఎక్కడికక్కడ వివాదాలను పరిష్కరించేందుకు వీలు కలుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సభల ఏర్పాటు ద్వారా సర్వేపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. సర్వేలో భాగంగా డ్రోన్ కెమెరాలతో పాటు సర్వేరాళ్లను అందుబాటులో ఉంచుతారు. అలాగే సర్వేయర్లకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తారు.
కొత్త జిల్లాల ఏర్పాటునూ, భూముల రీసర్వేను ఏకకాలంలో పూర్తి చేయాలని గతంలో ప్రభుత్వం భావించినా అది సాధ్యం కాలేదు. దీంతో ఇప్పుడు వేర్వేరుగానే ఈ రెండు పనులు చేపట్టనున్నారు.