నేడు ఏపీ అసెంబ్లీలో మరోసారి దిశ బిల్లు- కేంద్రం అభ్యంతరాల నేపథ్యంలో సవరణలతో
హైదరాబాద్ శివార్లలో అత్యాచారం, హత్యకు గురైన దిశ ఘటన నేపథ్యంలో ఏపీలో అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా నివారించే లక్ష్యంతో వైసీపీ సర్కారు గతేడాది డిసెంబర్లో దిశ బిల్లును తీసుకొచ్చింది. ఇందులో మహిళలు, చిన్నారులపై వేధింపులు, అత్యాచారాలు సహా ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలతో పాటు అవి జరిగిన సందర్భాల్లో గరిష్టంగా 21 రోజుల్లో ఉరిశిక్ష అమలు చేసేలా ప్రభుత్వం కఠిన నిబంధనలు పెట్టింది.
ఏపీ అసెంబ్లీ ఆమోదించి పంపిన దిశ బిల్లు 2019ను కేంద్రం తిరస్కరించింది. ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న ఐపీసీ, సీఆర్పీసీ చట్టాలకు అనుగుణంగా లేదనే కారణంతో ఈ బిల్లును కేంద్రం గతంలో తిరస్కరించింది. ముఖ్యంగా 21 రోజుల్లో నిందితులకు ఉరిశిక్ష విధించాలన్న నిబంధన ఐపీసీ చట్టానికి అనుగుణంగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణమైంది. దీంతో మరోసారి ఈ చట్టంలో మార్పులు చేసి ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ఆమోదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
వాస్తవానికి దిశ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అసెంబ్లీలో ఆమోదించుకున్న తర్వాత రాష్ట్రంలో ఈ బిల్లులో పేర్కొన్న విధంగా ప్రత్యేక పోలీసు స్టేషన్లు, ప్రత్యేక న్యాయస్దానాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే కేంద్రం అడ్డుపుల్ల వేయడంతో వాటిని చట్టంతో సంబంధం లేకుండానే పనిచేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే కేసుల దర్యాప్తు సంగతి ఎలా ఉన్నా.. శిక్షల విషయంలో మాత్రం చట్టం లేకుండా అమలు సాధ్యం కాదు. దీంతో ప్రభుత్వం మరోసారి సవరణలతో దిశ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడుతోంది. గతానుభవాల నేపథ్యంలో ఈసారి కేంద్రం సూచించిన మార్పులు చేసినట్లు తెలుస్తోంది.