ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్ సర్కార్ సై..సుప్రీంకు ప్రభుత్వం..న్యాయనిపుణులతో సీఎం మంతనాలు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తూ వెంటనే పోస్టింగు ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మూడు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టులో రేపో మాపో ఈ పిటిషన్ను దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.
Vizag Gas Leak: షాకింగ్ ట్విస్ట్.. ఎల్జీ పాలిమర్స్ ప్లాంటు సీజ్.. ఏపీ హైకోర్టు మరో సంచలనం..
ఏబీ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు ప్రభుత్వం
ఏపీ సర్కార్కు హైకోర్టులో వరుస షాకులు తగులుతున్న నేపథ్యంలో తిరిగి ఆ హైకోర్టు తీర్పులపై సుప్రీంకు వెళ్లాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్కు సంబంధించి విచారణ చేసిన హైకోర్టు సస్పెన్షన్ను ఎత్తివేస్తూ తీర్పు ఇచ్చింది. వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ ఆదేశాలు ప్రభుత్వానికి జారీ చేసింది. ఈ క్రమంలోనే ఏబీ వ్యవహారంను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ ప్రభుత్వం న్యాయనిపుణుల సలహా తీసుకుని సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావించినట్లు తెలుస్తోంది. ఇక రెండు రోజుల్లో ఈ పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఫైల్ చేస్తారని తెలుస్తోంది.
ఏబీ వ్యవహారంపై సంతృప్తిగా లేని వైసీపీ
చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు పై నంద్యాల ఉప ఎన్నికల సమయంనుంచి వైసీపీ గుర్రుగా ఉంది. ఆయన పోలీసు అధికారిలా కాకుండా టీడీపీ నేతగా వ్యవహరించారంటూ ఆరోపించింది. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉంటే ఎన్నికలు సక్రమంగా జరగవని ఒక వర్గానికి చెందిన అధికారులనే నిఘా విభాగంలో కీలక స్థానంలో నియమించారనేది వైసీపీ నాటి ఆరోపణ. అదే విషయాన్ని ఎన్నికల సంఘానికి వైసీపీ నాడు ఫిర్యాదు చేసింది. ఫలితంగా ఏబీ వెంకటేశ్వరరావును ఎన్నికల విధులనుంచి తప్పిస్తూ నాడు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దాంతో నాటి సీఎం చంద్రబాబు విబేధించినా నిర్ణయం అమలు చేయక తప్పలేదు.
హైకోర్టు తీర్పుతో ఏబీకి ఊరట
ఇక జగన్ ముఖ్యమంత్రి అయిన నాటినుంచి సంవత్సరకాలంగా ఏబీ వెంకటేశ్వరరావుకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. కొద్దినెలల క్రితం ఏబీ వెంకటేశ్వరరావు నిఘా పరికరాలను దుర్వినియోగం చేయడంతో పాటుగా గోల్మాల జరిగిందంటూ పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. దీనిపైన విచారణకు ఆదేశించింది. కేంద్ర హోంశాఖ సైతం ఈ ఫిర్యాదుపైన పూర్తిస్థాయిలో విచారణ చేయాలని ఆదేశాలను జారీ చేసింది. తనను సస్పెండ్ చేయడం పై ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ను ఆశ్రయించారు. క్యాట్ సైతం ప్రభుత్వ నిర్ణయాన్నే సమర్థించింది. దీంతో తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా దాన్ని విచారణ చేసిన కోర్టు ఏబీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో భారీ ఊరట లభించినట్లయ్యింది.
ఏబీ కేసుతో పాటు ఇతర తీర్పులపై సుప్రీంకు ప్రభుత్వం..?
హైకోర్టులో వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలు వ్యతిరేక తీర్పులపైన ముఖ్యమంత్రి జగన్ ఏవిధంగా ముందుకెళతారనే చర్చ జోరుగా సాగింది. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం తలపులు తట్టేందుకు రంగం సిద్ధం చేస్తుండటంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తి కరంగా మారనుంది. ఈ తీర్పునే కాకుండా రంగుల విషయం, డాక్టర్ సుధాకర్ విషయంలలో కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పులను సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ జరుగుతోంది.