డాక్టర్ సుధాకర్ వ్యవహారం సుప్రీంలోనే తేల్చుకునేందుకు జగన్ సర్కార్ రెడీ..!
అమరావతి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టుల నుంచి వరుస ఎదురు దెబ్బలు తగులుతుండటంతో ఆ తీర్పులను లేదా ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని జగన్ సర్కార్ డిసైడ్ అయ్యింది. వీటన్నిటిపై న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటోంది. కొద్ది రోజుల క్రితం నిఘా విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు తిరిగి పోస్టింగు ఇవ్వాలంటూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు తలపులు తట్టేందుకు నిర్ణయించిన జగన్ ప్రభుత్వం... తాజాగా విశాఖపట్నం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ సుధాకర్ అరెస్టు వ్యవహారం ఆపై మానసిక చికిత్సాలయంకు తరలించిన వ్యవహారంలో కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేసిన హైకోర్టు ప్రభుత్వానికి ప్రతికూలంగా ఆదేశాలు జారీ చేసింది. సుధాకర్ వ్యవహారంలో సీబీఐతో ఎందుకు విచారణ చేయించరాదని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం అధీనంలో నడిచే విచారణ సంస్థలపై తమకు నమ్మకం లేదని వ్యాఖ్యానించిన హైకోర్టు... కేసును సీబీఐ విచారణకు ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలంటూ ప్రశ్నించింది. ఇప్పుడు హైకోర్టు చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు న్యాయ నిపుణులతో కూడా చర్చించినట్లు సమాచారం.
ఇక ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించకపోవడంతోనే డాక్టర్ సుధాకర్పై సస్పెన్షన్ వేటు వేసినట్లు ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. ప్రభుత్వం మాస్కులు సరఫరా చేయడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు డాక్టర్ సుధాకర్. అయితే సుధాకర్ వ్యాఖ్యల వెనక టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు ఉన్నారంటూ వైసీపీ ఎదురుదాడికి దిగింది. అంతేకాదు ఎమ్మెల్యే టికెట్ కోసం గతంలో టీడీపీ నుంచి సుధాకర్ ప్రయత్నించిన విషయాన్ని వైసీపీ నేతలు బయటపెట్టారు. అయితే ఈ ఎపిసోడ్ ముగిసిన కొద్ది రోజులకు మళ్లీ డాక్టర్ సుధాకర్ విశాఖ రోడ్లపై హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. జగన్ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. వ్యక్తిగతంగా ప్రభుత్వాన్ని తీవ్రంగా ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని ప్రభుత్వం చెబుతోంది..
అయితే డాక్టర్ సుధాకర్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు, దూషణలను హైకోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పటికీ అవేమీ పట్టించుకోలేదన్న భావనలో ప్రభుత్వం ఉంది. కేవలం మెజిస్ట్రేట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐకి కేసు విచారణను ఎలా అప్పగిస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే సుప్రీంకోర్టుకు వ్యవహారంను తీసుకెళుతున్న ప్రభుత్వానికి అక్కడ ఎలాంటి తీర్పు వస్తుందో అన్న ఆసక్తి ఇటు రాజకీయవర్గాల్లోను అటు ప్రభుత్వ వర్గాల్లోను నెలకొంది.