ఏపీలో ఇక రాష్ట్ర రహదారులపైనా టోల్ టాక్స్- 11 రూట్ల ఎంపిక- సీఎం గ్రీన్ సిగ్నల్
నిధుల కొరతతో అల్లాడుతున్న ఏపీలో ఖజానాకు రాబడి తెచ్చే ఏ ఒక్క అవకాశాన్నీ ప్రభుత్వం వదులుకోవడం లేదు. ఇప్పటివరకూ జాతీయ రహదారులతో పాటు కేవలం నాలుగు రాష్ట్ర రహదారులకే పరిమితమైన టోల్ట్సాక్స్ను మిగతా రోడ్లపైనా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం రాష్ట్రంలో రద్దీగా ఉండే రూట్లను గుర్తించడంతో పాటు ఎక్కడెక్కడ టోల్ప్లాజాలు ఏర్పాటు చేయాలనే అంశంలోనూ అధికారులు ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం త్వరలో రాష్ట్ర రహదారులపై టోల్ బాదుడు ప్రారంభం కానుంది. ఏపీలో రహదారుల అభివృద్ధి సంస్ధకు నిధుల సేకరణ పేరుతో ఈ నిర్ణయానికి రాష్ట్ర కేబినెట్ త్వరలో ఆమోదం తెలపనుంది.
జాతీయ రహదారులపై టోల్ట్యాక్స్..
ఏపీతో పాటు దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఇప్పటికే టోల్ట్యాక్స్ అమలవుతోంది. ప్రతీ 50-60 కిలోమీటర్ల పరిధిలో జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్ధ ఎన్హెచ్ఏఐ ఇప్పటికే టోల్ వసూలు చేస్తోంది. ప్రభుత్వాల వద్ద రోడ్లు నిర్మించే నిధులు లేకపోవడంతో ప్రైవేటు సంస్ధలకు పీపీపీ విధానంలో కాంట్రాక్టులు ఇచ్చి నిర్మాణం పూర్తయ్యాక కనీసం 20 ఏళ్ల నుంచి అపరిమితంగా టోల్ట్యాక్స్ వసూలు చేసుకునేందుకు అనుమతిచ్చారు. దీనిపైనే ఎన్నో విమర్శలు. పలుచోట్ల టోల్ట్సాక్స్ మిస్ కాకుండా ఒకచోట 70-80 కిలోమీటర్లకు, మరికొన్ని చోట్ల 30-40 కిలోమీటర్ల దూరంలోనే టోల్ట్సాక్స్ బాదేస్తున్నారు. దీనిపై ఎన్నో విమర్శలున్నా ఈ దందా దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది.
రాష్ట్ర రహదారులపైనా టోల్ బాదుడు...
రాష్ట్రంలో ప్రస్తుతం రోడ్ల పరిస్ధితి అధ్వాన్నంగా ఉంది. వర్షాకాలం కంటే ముందే రోడ్లు వేయాల్సి ఉన్నప్పటికీ కరోనా పేరుతో వాటిని పట్టించుకోలేదు. దీంతో జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులు కూడా దారుణంగా తయారయ్యాయి. వీటిని ఎప్పుడు వేస్తారో తెలియదు. అంతలోనే రాష్ట్ర రహదారుల అభివృద్ధి నిధుల పేరుతో కొత్తగా రాష్ట్ర రహదారులపై టోల్ట్యాక్స్ విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో రద్దీగా ఉండే 35 రూట్లలో 750 కిలోమీటర్ల దూరాన్ని టోల్ట్సాక్స్ విధించేందుకు అనువైనదిగా అధికారులు గుర్తించారు. వీటిలో 11 రూట్లను తొలి విడతగా టోల్ పరిధిలోకి తీసుకొస్తారు. ఆయా రూట్లలో టోల్ట్యాక్స్ వసూలు ద్వారా ఏటా రూ.100 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
జాతీయ రహదారుల ట్యాక్స్లో సగం...
జాతీయ రహదారుల ప్రాధికార సంస్ధ ప్రస్తుతం జాతీయ రహదారులపై టోల్ప్లాజాల ద్వారా పన్ను వసూలు చేస్తోంది. ఇందులో దూరం, రోడ్డు నిర్మాణానికి అయిన ఖర్చు, ఇతర కాంట్రాక్టు నిబందనల మేరకు వేర్వేరు రేట్లలో పన్ను విధిస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్హెచ్ఏఐ తరహాలోనే టోల్ ప్లాజాలు పెట్టాలని భావిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రహదారులపైనా అదే విధంగా టోల్ బాదుడు మొదలు కానుంది. అయితే జాతీయ రహదారులతో పోలిస్తే సగం పన్ను వసూలు చేయాలని నిర్ణయించారు. జాతీయ రహదారులతో పోలిస్తే రాష్ట్ర రహదారుల నిర్మాణానికి అయ్యే ఖర్చు తక్కువ కావడం, ఇతరత్రా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Recommended Video
ముందుగా ఈ రూట్లలో టోల్ట్యాక్స్..
రాష్ట్రంలో రద్దీగా ఉండే 35 రూట్లను టోల్ట్సాక్స్ విధింపునకు అనువైనవిగా గుర్తించారు. వీటిలో తొలి విడతలో 11 రూట్లలో పన్ను బాదుడు ప్రారంభమవుతుంది. ఇక్కడ విజయవంతం అయితే మిగతా 24 రూట్లలోనూ వెంటనే టోల్ ట్యాక్స్ మొదలవుతుంది. తొలి విడతలో టోల్ట్యాక్స్ విధించే రూట్లను అధికారులు సూచన ప్రాయంగా నిర్దయించారు. వీటిలో కడప-పులివెందుల, ఏలూరు-జంగారెడ్డిగూడెం, భీమవరం-గుడివాడతో పాటు మరికొన్ని రహదారులు ఉన్నాయి. వీటిలో 50-60 కిలోమీటర్లకో టోల్ప్లాజా ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ విజయవంతం అయితే రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్దాయిలో అన్ని రోడ్లకూ టోల్ విధించేందుకు మార్గం సుగమం అవుతుంది. లేకపోతే పరిస్ధితిని బట్టి మార్పులుంటాయి. త్వరలో జరిగే కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది.