మద్యనిషేధ ఏపీలో త్వరలో లిక్కర్ మాల్స్- ఈ ఏడాది షాపుల తగ్గింపుకూ మంగళం...
ఏపీలో మద్య నిషేధం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకుంటున్న వైసీపీ సర్కారు తాజాగా ప్రకటించిన మద్య విధానం దానికి పూర్తి భిన్నంగా ఉంది. విపక్షాలు విమర్శిస్తున్నా పట్టించుకోకుండా కరోనాలోనే మద్యం షాపుల్ని తెరిచిన ప్రభుత్వం ఏడాది లోపే 13 శాతం షాపుల్ని మూసేసింది. కానీ ఇప్పుడు మద్యం విధానంలో మరికొన్ని షాపుల తగ్గింపు కోసం ప్రకటన చేయాల్సి ఉండగా.. అలాంటి దేమీ లేదని స్పష్టం చేసింది. అంతటితో ఆగకుండా రాష్ట్రంలో కొత్తగా మద్యం మాల్స్ తీసుకొస్తామని ప్రకటించి మరో షాక్ ఇచ్చింది. దీంతో మద్య నియంత్రణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అర్ధమైపోయిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
కొత్త లిక్కర్ పాలసీ- మద్య నియంత్రణకు తూట్లు..?
ఏపీలో మద్య నియంత్రణపై చిత్తశుద్ధి ఉందని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన మద్యం విధానంలో దానికి స్వయంగా తూట్లు పొడిచేలా కొన్ని నిర్ణయాలు ప్రకటించింది. దశాబ్దాలుగా మద్యాన్ని రాష్ట్ర ఖజానాకు రాబడిగా చూసిన ప్రభుత్వాల స్ధానంలో వైసీపీ సర్కారు రాబడిని వదులుకుని మరీ ప్రజల జీవితాల్లో మార్పు తెస్తుందని భావించిన వారికి ఈసారి నిరాశే ఎదురైంది. మద్య నియంత్రణలో భాగంగా షాపుల తగ్గింపు, బార్ల తగ్గింపు, మద్యం ప్రధాన బ్రాండ్ల స్ధానంలో ఊరూపేరూ లేని బ్రాండ్లు తీసుకురావడం, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టే్ందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఈసారి మద్యం పాలసీలో మాత్రం వీటిలో చాలా చర్యలకు మంగళం పాడేయడమే కాకుండా కొత్తగా మద్యం మాల్స్ ప్రతిపాదన తీసుకురావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
షాపుల తగ్గింపుకు మంగళం...
ఏపీలో గతేడాది అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు ఎన్నికల హామీ ప్రకారం ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో ఉన్న మద్యం షాపులను స్వాధీనం చేసుకుంది. వాటిని ఏటా 20 శాతం చొప్పున తగ్గిస్తూ ఐదేళ్లలో మద్య నియంత్రణ చేస్తామని హామీ ఇచ్చింది. చెప్పినట్లుగానే మొదటి ఏడాది 20 శాతం షాపుల్లో కోత విధించింది. ఆ తర్వాత కరోనా రాకతో మద్యం షాపులు మూతపడటం, వాటిని తెరిచే ప్రయత్నంలో భారీగా ధరలు పెంచడం, తీవ్ర విమర్శలతో ఒత్తిడిలోకి వెళ్లి ఏడాది పూర్తి కాకముందే మరో 13 శాతం షాపుల్ని మూసేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో మొత్తం 33శాతం షాపులు మూతపడ్డాయి. వాస్తవానికి ఏడాది పాలన పూర్తి చేసుకున్న వైసీపీ సర్కారు ఈ ఏడాది మరో 20 శాతం షాపుల్నితగ్గించాల్సి ఉండగా.. ఈసారి అలాంటిదేమీ లేదని ప్రభుత్వం తేల్చేసింది.
వాక్ ఇన్ షాప్స్ మద్యం మాల్స్...
ఈసారి మద్యం షాపుల్లో కోత లేకపోగా.. కొత్తగా మద్యం మాల్స్ను అందుబాటులోకి తీసుకరావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరో కలకలం రేపింది. మద్యం షాపుల్లో గతంలో తాము వినియోగించిన బ్రాండ్స్ దొరకడం లేదని బాధపడుతున్న వారి కోసమే అన్నట్లుగా వాక్ ఇన్ షాప్స్ పేరుతో మద్యం మాల్స్ ప్రారంభిస్తామని ప్రభుత్వం తాజా పాలసీలో ప్రకటించింది. ఓవైపు మద్యం షాపుల్ని మూసేస్తూ మరోవైపు ఏకంగా మాల్స్ ఏర్పాటుకు సిద్ధం కావడంతో ప్రభుత్వం అసలు మద్యం నియంత్రణ దిశగా అడుగులేస్తుందా లేదా అన్న చర్చ మొదలైంది. తాజా మద్యం విధానం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 100 లిక్కర్ మాల్స్ను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన నగరాలతో పాటు పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అన్ని బ్రాండ్ల మద్యం అందుబాటులో ఉంచుతారని తెలుస్తోంది.
Recommended Video
తిరుపతికి మాత్రం మినహాయంపు...
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మద్యం షాపుల తగ్గింపు ఉండదని ప్రకటించిన ప్రభుత్వం... తిరుపతిలో మాత్రం మద్యం షాపుల ఏర్పాటుపై నిషేధం విధించారు. తిరుపతి పరిధిలోని రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి వరకూ, ఆర్టీసీ బస్టాండ్, లీలామహల్ సర్కిల్, నంది సర్కిల్, విష్ణు నివాసం, శ్రీనివాసం, ఎన్పీఆర్ఆర్ ఆస్పత్రి, స్విమ్స్ ప్రాంతాల్లో మాత్రం మద్యం దుకాణాలను అనుమతించరు. ఇకపై మద్యం దుకాణాల్లో అక్రమాల నియత్రణకు ట్రాక్ అండ్ ట్రేస్ విధానం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చే మద్యం మాల్స్ ఉండే చోట సాధారణ మద్యం షాపుల్ని మాత్రం తొలగిస్తారని తెలుస్తోంది.