ఏపీలో నవంబర్ 2 నుంచే స్కూళ్లు- రోజు విడిచి రోజు క్లాసులు- కీలక మార్పులివే...
ఏపీలో కరోనా ప్రభావంతో ప్రస్తుత విద్యాసంవత్సరం నానాటికీ ఆలస్యం అవుతుండటంతో ఎట్టి పరిస్ధితుల్లోనూ నవంబర్ 2 నుంచి పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఈ మేరకు సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు విద్యార్ధుల తల్లితండ్రుల అభిప్రాయాల ఆధారంగానే తరగతులు నిర్వహిస్తారు. పాఠశాలలకు తమ పిల్లలను పంపేందుకు తల్లితండ్రులు నిరాకరిస్తే అప్పుడు ఆన్లైన్ క్లాసుల వైపు మొగ్గు చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నవంబర్ 2 నుంచే స్కూళ్లు...
ఏపీలో కరోనా కారణంగా ఈ ఏడాది మార్చిలో మూతపడిన విద్యాసంస్దలు తిరిగి నవంబర్ 2 నుంచి తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలో కరోనా పరిస్ధితులు క్రమంగా అదుపులోకి వస్తుండటం, విద్యార్ధులను స్కూళ్లకు పంపేందుకు తల్లితండ్రులు కూడా సిద్ధమవుతున్న సంకేతాలతో ప్రభుత్వం నవంబర్ 2 నుంచి పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం నుంచి ఆధేశాలు వెళ్లాయి. ఇప్పటికే విద్యాకానుకతో పాటు విద్యార్ధులకు అవసరమైన అన్ని పాఠ్యపుస్తకాలను కూడా అందించిన ప్రభుత్వం విద్యాసంవత్సరాన్ని యథాతథంగా కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. సిలబస్లో మాత్రం కొన్ని మార్పులు చేస్తున్నారు.
రెండురోజులకోసారి తరగతులు..
రాష్ట్రంలో కరోనా క్రమంగా అదుపులోకి వస్తున్నా పాఠశాలలు తెరిచి విద్యార్ధులను అనుమతిస్తే కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకోసం రెండురోజులకోసారి విద్యార్ధులకు తరగతులు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. నవంబర్ 2 నుంచి పాఠశాలలు ప్రారంభం అయ్యాక 1, 3, 5, 7 తరగతుల విద్యార్ధులకు ఒక రోజు. 2,4, 6, 8 తరగతుల విద్యార్ధులకు మరోరోజు తరగతులు నిర్వహిస్తారు.
విద్యార్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటే మాత్రం వారికి మూడో రోజు తరగతులు నిర్వహిస్తారు. 750 మంది కంటే ఎక్కువ విద్యార్ధులు ఉన్న స్కూళ్లకు ఈ విధానం వర్తిస్తుంది. అలా చేయడం ద్వారా విద్యార్ధుల రద్దీని తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు విద్యాశాఖాధికారులు షెడ్యూల్ను కూడా సిద్ధం చేస్తున్నారు.
ఒంటిపూట బడులు...
స్కూళ్ల పునఃప్రారంభం సందర్భంగా అన్ని కరోనా మార్గదర్శకాలను తప్పనిసరి చేయనున్నారు. విద్యార్ధుల మధ్య భౌతిక దూరంతో పాటు ఇతర ఆంక్షలను అమలు చేస్తారు. అలాగే స్కూళ్లలోనూ శానిటైజర్లు, మాస్కుల వాడకం కూడా ఉంటుంది. దీంతో పాటు కేవలం ఒక పూట మాత్రమే స్కూళ్లు పనిచేసేలా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తోంది. మధ్యాహ్నం తరగతులు ముగిశాక భోజనం పెట్టి విద్యార్ధులను ఇళ్లకు పంపిస్తారు. నవంబర్ నెల మొత్తం ఇదే విధానం కొనసాగించాలని జగన్ నిర్ణయించారు. పరిస్ధితిని అంచనా వేశాక డిసెంబర్లో ఇతరత్రా మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Recommended Video
విద్యార్ధులు రాకపోతే ఆన్లైన్లోనే..
కరోనా భయాలతో తమ పిల్లలను తల్లితండ్రులు స్కూళ్లకు పంపకపోతే మాత్రం ఆన్లైన్ విధానం వైపు మొగ్గు చూపాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం చాలా జిల్లాల్లో కరోనా నియంత్రణలోనే ఉంది. కాబట్టి స్కూళ్లకు విద్యార్ధులను పంపే అవకాశం ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలా కాక ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగి తల్లితండ్రులు విద్యార్ధులను బడికి పంపకపోతే మాత్రం అక్కడ ఆన్లైన్ ద్వారా క్లాసులు నిర్వహించేలా ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో విద్యార్ధులు విద్యాసంవత్సరం నష్టపోకుండా చూడాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది.