ఏపీలో స్కూల్స్ రీ ఓపెనింగ్- సర్వత్రా అభ్యంతరాలు- సెప్టెంబర్ 5న సాధ్యమేనా ?
ఏపీలో కరోనా ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు దాదాపు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. పిల్లలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.. ఇలాంటి పరిస్ధితుల్లో సెప్టెంబర్ 5న విద్యాసంస్ధలు తిరిగి ప్రారంభించాలన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులను పరుగులు తీయిస్తోంది. విద్యార్ధులకు అవసరమైన పాఠ్యపుస్తకాలతో పాటు ఈసారి ఇచ్చే జగనన్న స్కూల్ కిట్లను కూడా సిద్ధం చేస్తున్నారు.. అయితే పాఠశాలలు తెరిస్తే తల్లితండ్రులు విద్యార్ధులను పంపుతారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. కరోనాలో స్కూళ్లను తెరవడంపై తల్లితండ్రులు, విపక్షాల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వం చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుంటుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది.
Recommended Video
స్కూళ్ల రీ ఓపెనింగ్కు రెడీ...
ఏపీలో కరోనా ప్రభావం ఇంకా తగ్గనే లేదు. ప్రతీ జిల్లాలో కనీసం 400 నుంచి వెయ్యి కేసులకు పైగా ప్రతీ రోజూ నమోదవుతూనే ఉన్నాయి. మార్చిలో మూతపడిన విద్యాసంస్ధలు తెరిచే పరిస్ధితి లేకపోవడంతో విద్యార్ధులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ప్రైవేటు విద్యాసంస్ధలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుండటంతో తల్లితండ్రులు కొంతలో కొంత ఊరటగ పొందుతున్నారు. కానీ ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్ధుల పరిస్ధితి దారుణంగా ఉంది. విద్యాసంవత్సరం నానాటికీ ఆలస్యమవుతున్న తరుణంలో వారికి అటు ఆన్లైన్ క్లాసులు నిర్వహించలేక దూరదర్శన్ ద్వారా వీడియో పాఠాలతో సరిపెడుతున్నారు. కానీ ప్రస్తుతం కరోనాను కూడా లెక్కచేయకుండా సెప్టెంబర్ 5న తప్పనిసరిగా పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలతో విద్యాధికారులు తలపట్టుకుంటున్నారు.
తల్లితండ్రుల గగ్గోలు...
సెప్టెంబర్ 5న స్కూళ్లను ఎట్టిపరిస్ధితుల్లోనూ తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు చిన్నారులను స్కూళ్లకు పంపాలా వద్దా అన్న అంశం తల్లితండ్రులకు ఇబ్బందిగా మారింది. కరోనా తర్వాత స్కూళ్లను తెరిచిన చోట విద్యార్ధులు వైరస్ బారిన పడుతున్న వార్తలు ఓవైపు.. విద్యాసంవత్సరం కోల్పోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళన మరోవైపు వారిని పట్టి కుదిపేస్తున్నాయి. మరోవైపు మిగతా విద్యార్ధులతో పాటు తమ పిల్లలనూ స్కూళ్లకు పంపిస్తే ఓ బాధ.. పంపించకపోతే మరో బాధ అన్నట్లుగా వీరి పరిస్ధితి తయారైంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వమే కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకూ స్కూళ్లను మూసి ఉంచాలని వారు కోరుతున్నారు.
విపక్షాల ఆగ్రహం...
ఏపీలో కరోనా కొనసాగుతున్నా మూర్ఖంగా ప్రభుత్వం స్కూళ్లను రీఓపెనింగ్ చేయాలని తీసుకున్న నిర్ణయం దారుణమని విపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా విద్యామంత్రి కరోనా బారిన పడి ఇతర రాష్ట్రాల్లో చికిత్స తీసుకుంటూ విద్యార్ధులను మాత్రం స్కూళ్లకు పంపాలనడం విచిత్రంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం మద్యం షాపులు తెరిచి మందు బాబులకు టీచర్లను కాపలా పెట్టి వందల మంది టీచర్లను కరోనా బారిన పడేశారు. ఇప్పుడు స్కూళ్లు తెరచి విద్యార్థులను కరోనా బాధితుల్ని చేస్తారా? మన రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి ముఖ్యమంత్రి బయటకు రావడం లేదు. విద్యార్థులు బడులకు ఎలా వస్తారు? ఎస్సి, బీసీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో కరోనా దృష్ట్యా అదనంగా ఎలాంటి సదుపాయాలు కల్పియించలేదు. మరి స్కూళ్లు ఎలా తెరుస్తారు? విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్కూళ్లు తెరవాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని సత్యప్రసాద్ కోరారు.
రీఓపెనింగ్ వాయిదా పడుతుందా ?
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతున్న తరుణంలో తల్లితండ్రులు, విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 5న పాఠశాలల పునః ప్రారంభం వాయిదా వేయాలనే డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు పాఠశాలల రీఓపెనింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ పరిస్ధితిని బట్టి చివరి నిమిషంలో వాయిదా వేసే అవకాశాలూ లేకపోలేదు. విద్యార్దుల తల్లితండ్రుల అభిప్రాయాల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఒకవేళ స్కూళ్లు తెరిచి పిల్లలు కరోనా బారిన పడితే అప్పుడు విమర్శల తీవ్రత ఎక్కువవుతుంది కాబట్టి ప్రభుత్వం చివరి నిమిషంలో వెనక్కి తగ్గుతుందని తల్లితండ్రులు ఆశాభావంగా ఉన్నారు.