ఆక్సిజన్ కొరతకు చెక్: ఏపీలో 49 ప్లాంట్ల ఏర్పాటుకు సర్కారు చర్యలు
అమరావతి: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, సరఫరాకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రూ. 310 కోట్లు కేటాయిస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని 49 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, 50 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ వాహనాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 10వేల అదనపు ఆక్సిజన్ పైపులైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్లాంట్ల నిర్వహణకు ప్రతి జిల్లాలకు వచ్చే 6నెలలకు రూ. 60 లక్షలు మంజూరు చేసింది. ఆక్సిజన్ కొరతను నివారించేందుకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలావుండగా, విశాఖపట్నంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆక్సిజన్ సౌకర్యం లేకున్నా కరోనా బాధితుడైన తన భర్తను చేర్పించుకుని ఆయన మరణానికి ఓ ప్రైవేటు ఆస్పత్రి కారణమైందని ఓ మహిళ భోరునవిలపించింది. సుమారు గంటసేపు ఆక్సిజన్ అందక తన భర్త గిలగిలా కొట్టుకుని ప్రాణాలు కోల్పోయారని కన్నీరుమున్నీరయ్యారు. అంతేగాక, చికిత్స సమయంలో తన భర్తకు సరైన మందులు, తిండి ఇవ్వలేదన్నారు. ఆక్సిజన్ లేనప్పుడు ఎందుకు చేర్పించుకున్నారని ప్రశ్నించారు. తన భర్త ప్రాణం తీసిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తనకు, తన పిల్లలకు దిక్కెవరంటూ రోదించారు.
ఎన్440కే వైరస్: ఏపీ మంత్రిపై ఫిర్యాదు
ఏపీ మంత్రి అప్పలరాజుపై రవికుమార్, థరూర్ జేమ్స్ అనే ఇద్దరు వ్యక్తులు కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశఆరు. ఓ టీవీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. కర్నూలులో ఎన్440కే వైరస్ వ్యాప్తి చెందుతోందని, సాధారణ వైరస్ కంటే ఇది 15 రేట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని అన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యల వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, కరోనా నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, మంత్రిపై కేసు నమోదు చేయనట్లు సమాచారం.