అంతర్వేది ఘటనకు బాధ్యుడిగా ఈవో బదిలీ- చంద్రబాబుకు మాట్లాడే హక్కులేదన్న వెల్లంపల్లి...
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటన చాలా బాధాకరం అని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు అన్నారు. అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందన్నారు. మానవ తప్పిదమా....కావాలని ఎవరన్నా చేసిందా అనేదానిపై లోతైన విచారణ జరుగుతుందన్నారు. ఫిబ్రవరిలోగా 95 లక్షల రూపాయల ఖర్చుతో అంతర్వేది రథం నిర్మాణం జరిగే విధంగా ఆదేశాలు జారీ చేసిన్నట్లు మంత్రి వెల్లంపల్లి తెలిపారు.
అంతర్వేది ఆలయ ఘటనపై విపక్ష టీడీపీ చేస్తున్న విమర్శలపై మంత్రి వెల్లంపల్లి తీవ్రంగా స్పందించారు. హిందూ దేవాలయాల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదన్నారు. పుష్కరాల పేరుతో విజయవాడలో 40 గుళ్లు కూల్చిన చరిత్ర చంద్రబాబుది అన్నారు. అంతర్వేది ఘటనపై నిజనిర్ధారణ కమిటీ వేసిన చంద్రబాబు.. గతంలో పుష్కరాల్లో 23 మంది చనిపోయినప్పుడు ఎందుకు ఇలాంటి కమిటీ వేయలేదని మంత్రి వెల్లంపల్లి సూటిగా ప్రశ్నించారు.
భవిష్యత్తులో అంతర్వేది తరహా ఘటనలు జరగకుండా ప్రతీ దేవాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. అంతర్వేది ఘటన చూస్తుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేశాయన్న అనుమానం కలుగుతోందన్నారు. ప్రభుత్వానికి ఓ కులాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని వెల్లంపల్లి ఆరోపించారు. గతంలో చంద్రబాబు హయాంలో దుర్గగుడిలో చేసిన క్షుద్రపూజలపై విచారణ జరిపిస్తున్నామని, ఆయన వ్యవస్దలను మేనేజ్ చేసి తప్పించుకోవచ్చేమో కానీ దేవుడి నుంచి తప్పించుకోలేరన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవాలు నమ్మవద్దని ప్రజలను మంత్రి కోరారు.