ప్రైవేట్ ఆస్పత్రులకు జగన్ హెచ్చరికలు- ఉద్యోగులకు హెల్త్స్కీమ్ వర్తించకపోతే 10 రెట్లు ఫైన్..
ఏపీలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ఘనంగా అమలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్న వైసీపీ సర్కారు క్షేత్రస్ధాయిలో ఇబ్బందులను మాత్రం పట్టించుకోవడం లేదని మరోసారి తేలిపోయింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్టు సహకారంతో ఉద్యోగులకు ఆరోగ్య పథకం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకుంటున్నా ఉద్యోగులకు మాత్రం ప్రైవేటు ఆస్పత్రులు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
మోదీకి దగ్గరై ఏం సాధించారు?- ఆధార్ అడిగితే బేడీలా? -'ట్రావెన్కోర్’ ట్యాక్సులంటూ వైసీపీ ఎంపీ ఫైర్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి ఆరోగ్య పథకం కింద చికిత్స అందాల్సి ఉన్నా ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం డబ్బు చెల్లిస్తేనే వైద్యం అంటూ చుక్కలు చూపిస్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు ఎక్కువ కావడంతో ప్రభుత్వం స్పందించింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేటు ఆస్పత్రులు చికిత్సకు డబ్బు కట్టమని, మెడికల్ రీయింబర్స్మెంట్ పెట్టుకోమని సలహాలు ఇవ్వడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలకుపాల్పడుతున్న ఆస్పత్రులకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్టు తాజాగా కొన్ని సూచనలు చేసింది.
ఇప్పటికే ఆరోగ్యశ్రీ కింద బకాయిలను దాదాపుగా చెల్లించామని, ఈ నెలలోనూ రూ.31 కోట్లు ఇచ్చామని, త్వరలో మరో రూ.16 కోట్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే ఉద్యోగుల ప్రీమియాన్ని కూడా 90 రూపాయల నుంచి 225కు, 120 రూపాయల నుంచి 300కు పెంచినట్లు వెల్లడించింది. అంతే మొత్తం ప్రభుత్వ వాటా కూడా పెంచినట్లు ఆరోగ్యశ్రీ ట్రస్టు తెలిపింది. అయినా వారిని ఇబ్బందులు పెడుతున్న ఆస్పత్రుల తీరు సరికాదని ప్రభుత్వం తెలిపింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులను ఆరోగ్య పథకం కింద మాత్రమే చేర్చుకోవాలని ఆస్పత్రులకు స్పష్టం చేసింది. ఇందులో విఫలమైతే రోగుల వద్ద తీసుకున్న మొత్తానికి పది రెట్లు జరిమానా విధిస్తామని, సదరు ఆస్పత్రిని అన్ని పథకాల నుంచి 3 నెలల పాటు సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది.