అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో మసీదు...మక్కామసీదుకు ధీటుగా నిర్మాణం:ఎపి ప్రభుత్వం తాజా నిర్ణయం
అమరావతి:నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో మసీదు నిర్మించాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అమరావతిలో మసీదు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాల స్థలం కేటాయించింది.
ఈ మసీదును మక్కా మసీదుకు ఏమాత్రం తీసుపోని విధంగా నిర్మించాలని ఎపి ప్రభుత్వం భావిస్తోంది. బుధవారం ఉండవల్లిలో సీఆర్డీఏ, ఏడీసీ అధికారులతో రాజధాని పనులపై సమీక్ష సందర్భంగా సిఎం చంద్రబాబు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. హైదరాబాద్లోని మక్కా మసీదు నిర్మాణ శైలికి దీటుగా, ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించేలా దీని నిర్మాణం ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ప్రపంచ స్థాయి...మసీదు నిర్మాణం
రాజధాని పనులపై సమీక్షా సమావేశంలో ముందుగా సీఆర్డీయే కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీ పార్థసారధి వరుసగా రాజధానిలో జరుగుతున్న హౌసింగ్ కాంప్లెక్స్లు, రహదారులు- ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిని తెలిపే ప్రజెంటేషన్లను ఇచ్చారు. అనంతరం సిఎం చంద్రబాబు మసీదు నిర్మాణం గురించి ప్రస్తావిస్తూ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఈ మసీదు నిర్మాణం చేపట్టాలని...ఆ మేరకు వక్ఫ్బోర్డుతో చర్చించి వెంటనే ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సిఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
సంస్కృతులకు నిలయంగా...అమరావతి
టీటీడీ ఆధ్వర్యంలో వెంకటపాలెం వద్ద 25 ఎకరాల్లో తిరుమల ఆలయాన్ని తలపించే శ్రీవారి కోవెల నమూనాకు ఇటీవలే ఆమోదముద్ర వేసిన ఆయన, ఇప్పుడు అదే తరహాలోనే ముస్లిం సోదరుల కోసం పది ఎకరాల్లో పెద్ద మసీదును ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ... ‘‘ప్రజా రాజధాని అమరావతిని అన్ని మతాలు, విభిన్న సంస్కృతులకు నిలయంగా మార్చాలన్నది నా సంకల్పం. నూతన రాజధానిలో ఒకవైపు శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని, మరోవైపు మసీదును నిర్మించడం ద్వారా ఆ సందేశాన్ని అందించనున్నాం. మక్కా మసీదును తలపించేలా, అంతర్జాతీయ పర్యాటకులను సైతం ఆకట్టుకునే విధంగా ఈ మసీదును తీర్చిదిద్దుతాం'' అని ప్రకటించారు.
సిఆర్డీయే...భూ కేటాయింపులు
ఇదే సమావేశంలో మరి కొన్ని సంస్థలకు కూడా సిఆర్డిఎ భూ కేటాయింపులు జరిపింది. మురళీ ఫార్చ్యూన్ గ్రూపు నిర్మించనున్నహెల్త్ అండ్ రిక్రియేషన్ రిసార్ట్కు మూడున్నర ఎకరాల భూమి కేటాయించడంతో పాటు ఇందుకు సంబంధించిన పత్రాలను ఆ సంస్థ అధినేత ముత్తవరపు మురళీకృష్ణకు సిఎం చంద్రబాబు అందజేశారు. ఈ నిర్మాణం దసరాకి ప్రారంభించి తొమ్మిది నెలల్లోపే పూర్తి చేస్తామని మురళీకృష్ణ ఈ సందర్భంగా సిఎం చంద్రబాబుకు తెలిపారు. సుమారు రూ.40 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలిసింది.
త్వరగా...పూర్తిచేయండి
అలాగే కోస్తా మెరీనా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఎనిమిది ఎకరాలు కేటాయించారు. నదీ తీరం వెంబడి ఉండే ఈ భూభాగంలో 60 బోట్లు నిలిపి ఉంచడానికి వీలుగా జెట్టీలు, బోట్ క్లబ్, శిక్షణ కేంద్రం, ఫుడ్కోర్టు, రిక్రియేషన్ సెంటర్ లాంటివి నిర్మిస్తారని తెలిసింది. రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును ఆరు నెలల్లో పూర్తి చేయాలన్నది ప్రతిపాదనగా తెలుస్తోంది. అలాగే అమరావతి కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి వరుణ్ హాస్పిటాలిటీ సంస్థకు సీఆర్డీఏ ఐదు ఎకరాలు కేటాయించింది. పీపీపీ విధానంలో చేపట్టే ఈ ప్రాజెక్టును ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేయాలని ప్రతిపాదించడం జరిగింది. రెండు వేల మంది కూర్చునేందుకు వీలుగా మల్టీపర్పస్ కన్వెన్షన్ సెంటర్, బాంక్వెట్ హాల్ వంటివి నిర్మిస్తారని తెలిసింది.