ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం: ప్లాస్మా దాతలకు రూ.5 వేల ప్రోత్సాహకం, సీఎం జగన్ నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారిని ప్రోత్సహిస్తోంది. వారు ప్లాస్మా దానం చేస్తే రూ.5 వేల ప్రోత్సాహక నగదు అందజేస్తామని ప్రకటించింది. దీంతో వైరస్ తగ్గిన వారు ప్లాస్మాను డోనెట్ చేసేందుకు ముందుకొచ్చే అవకాశం ఏర్పడింది. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కరోనా వైరస్ నిర్మూలన, ఆస్పత్రుల్లో వైద్యం, విద్యావ్యవస్థ, నాడు-నేడుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షించారు.
Recommended Video
సమీప ఆస్పత్రిలో బెడ్..
ప్లాస్మా థెరఫీపై మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు. వైరస్పై అవగాహన కల్పించడానికి విస్తృతంగా ప్రచారం చేయాలని.. అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలని స్పష్టంచేశారు. ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకని పరిస్థితి ఉండరాదని ఉద్ఘాటించారు. ఎవరికైనా బెడ్ అందుబాటులో లేకుంటే సమీపంలోని ఆస్పత్రిలో బెడ్ అలాట్ జరిగేలా ఏర్పాటు చేయాలన్నారు.
మరింత శ్రద్ద తీసుకోండి..
హెల్ప్ డెస్క్లో ఉన్నవారికి ఓరియంటేషన్ బాగుండాలని.. పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులను పర్యవేక్షించాలన్నారు. జీజీహెచ్ లాంటి ఆస్పత్రులపై మరింత శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. ఆస్పత్రులపై దృష్టి సారించేలా జేసీలకు బాధ్యత అప్పగించాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, హెల్త్ స్పెషల్ సీఎస్ జవహర్రెడ్డి పాల్గొన్నారు.
ప్లాస్మా థెరపీ అంటే..
రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉన్నవారిపై కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది. వారి శరీరంలోకి వైరస్ ప్రవేశించగానే తెల్ల రక్త కణాలు దాడి చేసి వైరస్ను నాశనం చేస్తాయి. కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వారి రక్తంలో రోగనిరోధక కణాల సంఖ్య బాగా వృద్ధి చెంది ఉంటుంది. మరికొందరిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. వారిపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక కణాలనుపెంచితే వ్యాధిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరిస్తారు. వైరస్తో బాధపడుతున్న మిగతా రోగుల శరీరంలోకి ఎక్కించడంతో వారు వేగంగా కోలుకుంటారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి ప్లాస్మాను కరోనా సోకిన రోగిలో ఎక్కించడాన్నే ప్లాస్మా థెరపీ అని పిలుస్తారు.