రోహిత్ విద్యార్హతలపై తెలంగాణ పోలీస్ ఆరా, తల్లి విద్యార్హతలపై ఏపీ
గుంటూరు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ తల్లి రాధిక విద్యార్హతల పైన ఏపీ ప్రభుత్వం ఆరా తీసింది. రెండు రోజుల క్రితం రోహిత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి రావెల కిశోర్... తల్లి, తమ్ముడికి ఒప్పంద ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో గురజాల పోలీసులు రాధిక విద్యార్హతల వివరాలను పరిశీలించారు. డాక్టరు బీఆర్ అంబేడ్కర్ దూరవిద్యలో డిగ్రీ చదివేందుకు గుంటూరులోని హిందూ కళాశాల స్టడీ సెంటర్లో 2000లో రాధిక ప్రవేశం పొందారు.
అనంతరం గురజాలలోని అంబేడ్కర్ స్టడీ సెంటరులో పరీక్షలు రాస్తానని తన ప్రవేశాన్ని అక్కడకు బదిలీ చేయించుకున్నారు. మొదటి సంవత్సరం పరీక్ష ఫీజులు చెల్లించారు. అయితే పరీక్షలకు మాత్రం రాధిక హాజరు కాలేదని తెలుస్తోంది. ఆమె చదువును బట్టి ఉద్యోగం ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చూస్తోంది.
మరోవైపు, రోహిత్ ఆత్మహత్య ఘటనకు సంబంధించి వివరాల సేకరణలో భాగంగా హైదరాబాద్లో పోలీసులు గుంటూరులో విచారణ నిర్వహించారు. రైలుపేటలోని కన్న ఆంగ్ల మాధ్యమిక పాఠశాలలో రోహిత్ పదో తరగతి చదివాడు.
ఈ నేపథ్యంలో హైదరాబాదులోని మాదాపూర్ ఏసీపీ రమణ కుమార్ పాఠశాల డైరెక్టర్ కన్న మాస్టారుతో పలు విషయాలపై చర్చించారు. రోహిత్ ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు పాఠశాలలో చదివాడు, కుల ధ్రువీకరణ పత్రం ఏమైనా ఉందా? తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. 2004లో రోహిత్ తమ పాఠశాలలోనే పదో తరగతి పూర్తిచేశాడని డైరెక్టర్ చెప్పారు.