కరోనా టైమ్: ఏపీలో వచ్చేనెల మరో సంక్షేమ పథకం: ఇక వారి ఖాతాల్లోకి రూ.10 వేలు: బీసీ ఓటుబ్యాంకు
అమరావతి: కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా జగన్ సర్కార్.. మరో సంక్షేమ పథకాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవలే రైతు భరోసా కింద లబ్దిదారులకు ఆర్థిక సహాయాన్ని చెల్లించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక కొత్తగా జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించబోతున్నారు. వచ్చేనెల 5 లేదా 6వ తేదీల్లో ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. గ్రామ సచివాలయాల ద్వారా లబ్దిదారుల జాబితాను త్వరలో ప్రకటించబోతోంది.
వైజాగ్-బెంగళూరు: షార్ట్కట్లో ఫ్లయిట్ జర్నీ: కేంద్రం సరికొత్త చిట్కా: రూ.1000 కోట్లు ఆదా
వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
కులవృత్తులపై ఆధారపడి జీవితాన్ని కొనసాగిస్తోన్న వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి ఉద్దేశించిన పథకం ఇది. నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు చేయూతనివ్వడానికి ఈ పథకానికి రూపకల్పన చేసింది ప్రభుత్వం. జగనన్న చేదోడు పథకం కింద బీసీ కార్పొరేషన్ ద్వారా ఇదివరకే దరఖాస్తులను ఆహ్వానించింది. అయిదులక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. నిబంధనల ప్రకారం వాటన్నింటినీ వడపోసింది. రెండున్నర లక్షలకు పైగా దరఖాస్తుదారులను ఈ పథకం కిందికి చేర్చింది. వారి ఖాతాల్లో 10 వేల రూపాయల మొత్తాన్ని జమ చేయనుంది.
25వ తేదీ నాటికి లబ్దిదారుల జాబితా..
జగనన్న చేదోడు పథకం కింద అర్హులైన లబ్దిదారుల జాబితాను ఈ నెల 25వ తేదీ నాటికి దశలవారీగా ప్రకటించబోతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నెలకొల్పిన గ్రామ/వార్డు సచివాలయాల్లో ఈ జాబితాను అందుబాటులో ఉంచబోతోంది. ఈ పథకానికి తాము ఎంపిక అయ్యామో, లేదో తెలుసుకునే వెసలుబాటును కల్పించింది. అన్ని అర్హతలు ఉండి కూడా..ఈ పథకానికి లబ్దిదారులుగా ఎంపిక కాలేని వారి కోసం మరో విడతలో అవకాశం ఇవ్వడం ఖాయమని అధికారులు చెబుతున్నారు.
ఆయా వర్గాలపై కరోనా ప్రభావం..
జగనన్న చేదోడు పథకం కింద నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఆర్థికంగా ఆదుకోవడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదనే అభిప్రాయం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో వ్యక్తమౌతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేస్తోన్న లాక్డౌన్ ప్రభావం ఆయా వర్గాల ప్రజలపై తీవ్రంగా పడింది. లాక్డౌన్ వల్ల బార్బర్ షాపులు తెరవడానికి వీలు కలగట్లేదు. రోజుల తరబడి టైలర్లు తమ దుకాణాలను తెరవట్లేదు. రజకులు దాదాపు ఉపాధిని కోల్పోయే దశకు చేరుకున్నారు.
కరోనా కాలంలో ఆర్థిక చేయూతగా
ఈ పరిస్థితుల్లో జగనన్న చేదోడు పథకం కింద ఆయా వర్గాల ప్రజలకు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం సరైన నిర్ణయమని అంటున్నారు. 10 వేల రూపాయల నగదు మొత్తాన్ని అందించబోతుండటం ఆయా కుటుంబాల వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి ఇదే సరైన సమయమని అంటున్నారు. కులవృత్తుల మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తోన్న వారికి ఆర్థికంగా ఆదుకుంటామంటూ ఎన్నికల ప్రచార సమయంలో వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Recommended Video
బీసీ ఓటు బ్యాంకు బలంగా..
నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లుగా పని చేస్తోన్న వారందరూ వెనుకబడిన తరగతులకు చెందిన వారే. టైలర్లలో మైనారిటీలు కూడా ఉన్నారు. వారిని కూడా ఎంపిక చేశారా? లేదా? అనేది తెలియ రావాల్సి ఉంది. కరోనా వైరస్ మిగల్చిన సంక్షోభ సమయంలో వారికి ఆయా వర్గాల ప్రజలకు 10 వేల రూపాయల నగదు మొత్తాన్ని అందించబోతుండటం వారి కుటుంబాలకు ఊరట ఇస్తుందని అంటున్నారు. రాజకీయంగా బీసీ ఓటు బ్యాంకు చెక్కుచెదరదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.