ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: స్టేట్ రోడ్ ఫీజ్ బాదుడుకు రంగం సిద్ధం
ఏపీ సర్కార్ రహదారుల అభివృద్ధి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏపీ స్టేట్ రోడ్ ఫీజు పేరిట రహదారి పన్నులు వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్న సర్కార్ స్టేట్ రోడ్ ఫీజు ద్వారా వచ్చిన ఆదాయాన్ని రహదారుల అభివృద్ధికి కేటాయిస్తామని చెప్తుంటే, ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వాన్ని నడపడానికి ఆదాయం పెంచుకునే ప్రతి అవకాశాన్ని అన్వేషిస్తోంది అని పలువురు ఏపీలో రాష్ట్ర రోడ్డు ఫీజుల వసూళ్లపై అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
ఆదాయ మార్గాలను పెంచుకునే ఆలోచనలో ఏపీ సర్కార్
రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉన్న కారణంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆదాయ వనరులు పెంచుకునే అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించిన ఖాళీ స్థలాల వివరాలను సేకరిస్తున్న ఏపీ సీఎం , కమర్షియల్ గా ఉపయోగపడే స్థలాలను మినహాయించి, మిగతా వాటిని విక్రయించాలని ఆలోచనలో ఉన్నారని సమాచారం . అంతేకాదు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన నిరుపయోగంగా ఉన్న భూములను సైతం విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ఆలోచన చేస్తున్నారు.
రాష్ట్ర రహదారుల నిర్వహణ కోసం స్టేట్ టోల్ ఫీజుల వసూలు నిర్ణయం
ఇదే క్రమంలో తాజాగా రాష్ట్ర రహదారుల నిర్వహణ, అభివృద్ధి కోసం, స్టేట్ రోడ్ ఫీజులు వసూలు చేసి తద్వారా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తుంది. ప్రస్తుతం, అన్ని జాతీయ రహదారులపై మాత్రమే ప్రయాణికులపై టోల్ టాక్స్ వసూలు చేయబడుతోంది. కానీ ఏపీ సర్కార్ రాష్ట్ర రహదారులపై ప్రయాణించే ప్రజల నుండి టోల్ పన్ను వసూలు చేసే నిర్ణయాన్ని తీసుకుంది .
దీనిలో భాగంగా ప్రతి 60-90 కిలోమీటర్ల వద్ద టోల్ ప్లాజాలను ఏర్పాటు చేస్తారు . రోడ్లను ఉపయోగించే వాహనచోదకుల నుండి టోల్ వసూలు చేస్తారు.
ఏ వాహనాలకు టోల్ ఫీజు ఎంతంటే
ఇప్పుడు, ట్రాఫిక్ అధికంగా ఉన్న అన్ని రాష్ట్ర రహదారులపై టోల్ ప్లాజాలను ఏర్పాటు చేయడానికి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా రాష్ట్ర రహదారులపై తేలికపాటి వాహనాలు కిలోమీటర్ కు 90 పైసలు చొప్పున, పెద్ద వాహనాలకు కిలోమీటర్ కు 1.80 రూపాయలు చొప్పున , బస్సు లేదా ట్రక్కుల కు 3.55 రూపాయల చొప్పున , మల్టీ యాక్సిల్ వాహనాలకు 8.99 రూపాయల చొప్పున చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మొదటి దశలో ఈ మార్గాల్లోనే .. ప్రజలు ఈ నిర్ణయం స్వాగతిస్తారా?
ప్రయాణికుల నుండి వసూలు చేసిన టోల్ ఫీజు స్టేట్ హైవేల నిర్వహణకు ఉపయోగించటానికి రాష్ట్ర రహదారుల అభివృద్ధి అథారిటీకి వెళుతుందని ప్రభుత్వం పేర్కొంది. మొదటి దశలో, కడప-పులివెందుల, ఏలూరు-జంగారెడ్డిగూడెం మరియు భీమవరం-గుడివాడలతో సహా 35 రాష్ట్ర రహదారులు ఉన్నాయి. ప్రయోగం విజయవంతమైతే, మిగిలిన 24 మార్గాల్లో టోల్ ఫీజు వసూలు చేయబడుతుందని సమాచారం . ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర ప్రధాన రహదారుల నిర్వహణకు ఉపయోగపడుతుందని భావిస్తుంటే, ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల పరిస్థితి నేపధ్యంలో ప్రజలు టోల్ వసూళ్ల పై వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం లేకపోలేదు.