చంద్రబాబు హెరిటేజ్ కు అమూల్ తో జగన్ చెక్- త్వరలో ఎంవోయూ- ద్విముఖ వ్యూహంతో..
ఏపీలో మూడు దశాబ్దాల క్రితం ఓ వెలుగు వెలిగిన సహకార రంగ డెయిరీలు, చక్కెర ఫ్యాక్టరీలకు కార్పోరేట్ల రాకతో గండి పడింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడకంతో పాటు ఇతర అంశాల్లోనూ వారు ఎంతో ముందుండటంతో వారితో పోటీ పడలేక జిల్లా డెయిరీలు మూతపడ్డాయి. రైతులు దిక్కులేని వారయ్యారు. తిరిగి కార్పోరేట్లతో పోటీ పడే స్దాయికి తీసుకెళ్లేందుకు జగన్ సర్కారు త్వరలో ఓ కీలక ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఇది అమల్లోకి వస్తే ఏపీలో డెయిరీల బలోపేతంతో పాటు ప్రైవేటు రంగంలో ఉన్న హెరిటేజ్ డెయితో పాటు మరెన్నో కార్పోరేట్ సంస్ధలకు చుక్కలు కనిపించడం ఖాయమంటున్నారు.
అమూల్ ను తీసుకొస్తున్న జగన్...
దేశంలో సహకార ఉద్యమానికి మార్గదర్శిగా నిలిచిన గుజరాతీ సంస్ధ అమూల్ డెయిరీ ఇక ఏపీలో నేరుగా రంగంలోకి దిగబోతోంది. ఇన్నాళ్లూ రాష్ట్రంలో మిగిలిన ప్రైవేటు డెయిరీలతో కలిసి తన ఉత్పత్తులు అమ్ముకునేందుకు పరిమితమైన అమూల్ ను ఈసారి రాష్ట్రంలో సహకార డెయిరీలతో లింక్ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. అమూల్ కు ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీలో రైతులు వాడుకునేందుకు దీంతో అవకాశం దొరుకుకుంది. ఇప్పటికే అమూల్ తో ఏపీ ప్రభుత్వ అధికారులు జరిపిన చర్చలు విజయవంతం అయ్యాయి. దీంతో జూలై మొదటి వారంలోనే ఒప్పందం కుదుర్చుకునేందుకు అమూల్ ప్రతినిధులు ఇక్కడికి రానున్నారు.
అమూల్ తో ఒప్పందానికి మార్గదర్శకాలు సిద్ధం చేయాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.
సహకార డెయిరీల బలోపేతం- ప్రైవేటుకు చెక్...
ఏపీలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉండగానే చిత్తూరు సహా ఎన్నో డెయిరీలు నష్టాల బాట పట్టడానికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వ విధానాలే కారణమని దుయ్యబట్టేవారు. కానీ వైఎస్ హయాంలోనూ వీరికి చెక్ పెట్టడం సాధ్యం కాలేదు. అప్పటికే ప్రభుత్వ సహకార డెయిరీలకు దీటుగా ప్రైవేటు డెయిరీలు రాష్ట్రంలోకి రావడం, పాతుకుపోవడం జరిగిపోయాయి. దీంతో పాత టెక్నాలజీ మీదే ఆధారపడిన మన డెయిరీలకు వారితో పోటీ పడే అవకాశం లేక కుదేలయ్యాయి. కానీ ఇప్పుడు జగన్ ఏకంగా గుజరాతీ సహకార రంగ దిగ్గజం అమూల్ నే రంగంలోకి దింపుతుండటంతో ఇక ప్రైవేటు డెయిరీలకు చుక్కలు కనిపించడం ఖాయంగా తెలుస్తోంది.
రైతులకు, డెయిరీలకు ప్రయోజనమిదే...
అమూల్ రాకతో ప్రభుత్వ రంగంలోని డెయిరీల బలోపేతానికి మార్గం సుగమం అవుతుంది. గుజరాత్ లో తాను వాడుతున్న పరిజ్ఞానాన్ని రాష్ట్రంలో డెయిరీలతో అమూల్ పంచుకోనుంది. తద్వారా పాల ఉత్పత్తి రంగంలో పెను మార్పులు రావడం ఖాయం. అదే సమయంలో రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించడంతో పాటు అమూల్ సాయంతో మార్కెటింగ్ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. తద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధి చెందటంతో పాటు సహకార డెయిరీల బలోపేతం, రైతులకు లబ్ది చేకూరతాయి. ఓసారి ప్రభుత్వ డెయిరీలు బలోపేతమైతే ప్రైవేటు దోపిడీకి సహజంగానే చెక్ పడుతుంది.
చంద్రబాబు హెరిటేజ్ కూ చెక్...
డెయిరీ దిగ్గజం అమూల్ ను ఏపీ సర్కార్ రంగంలోకి దింపడం వెనుక అసలు కారణం ఇప్పటికే డెయిరీ రంగంలో మెరుగైన స్ధితిలో ఉన్న చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్ధకు చెక్ పెట్టడమే అనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో సహకార డెయిరీలను ముంచి వాటి పునాదులపైనే తన ప్రస్ధానం సాగిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న హెరిటేజ్ సంస్ధను టార్గెట్ చేస్తూ అంతకంటే మెరుగైన పరిజ్ఞానం కలిగిన అమూల్ ను జగన్ సర్కార్ రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఓసారి ఈ పరిజ్ఢానం అందుబాటులోకి రావడం మొదలై వాటి ఫలితాలు రైతులకు అందితే ఇక హెరిటేజ్ వంటి సంస్ధలకు చుక్కలు కనిపించడం ఖాయమే. అంటే జగన్ సర్కారు ద్విముఖ వ్యూహం సిద్దం చేస్తుందన్న మాట. అమూల్ రాకతో ఓవైపు సహకార రంగాన్ని బలోపేతం చేస్తూనే మరోవైపు తన రాజకీయ ప్రత్యర్ధికి చెందిన హెరిటేజ్ ను కుదేలు చేయడమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నట్లు అర్దమవుతోంది.
హెరిటేజ్ పై ముప్పేట దాడి...
ఇప్పటికే జగన్ ప్రభుత్వం గత టీడీపీ హయాంలో చంద్రన్న కానుక రూపంలో జరిగిన అవినీతి, అందులో హెరిటేజ్ కు కలిగిన లాభం వంటి అంశాలపై సీబీఐ విచారకు ఆదేశించింది. అప్పట్లో చంద్రన్న కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక పేరుతో హెరిటేజ్ నుంచి కోట్లాది రూపాయల విలువ చేసే డెయిరీ ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ఇందులో నెయ్యి, బటర్ మిల్క్ వంటివి కూడా ఉన్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా చంద్రబాబు సర్కారు హెరిటేజ్ ఉత్పత్తులను సరఫరా చేసేది. ఇప్పుడు వీటిపై సీబీఐ విచారణ ప్రారంభమయ్యే సమయానికి అమూల్ ఒప్పందం చేసుకోవడం చంద్రబాబుకు డబుల్ షాక్ గానే భావించవచ్చు.