విశాఖ ఘటనపై ఏపీ గరవ్నర్ దిగ్భ్రాంతి..! దుర్ఘటన హృదయవిదారకమన్న పవన్ కళ్యాణ్..!!
విశాఖపట్టణం/హైదరాబాద్ : కరోనా మహమ్మారి ఏపి ప్రజలపై చేస్తున్న విలయతాండవం ఆగకముందే మరో విపత్తు ముంచుకొచ్చింది. నూతన రాజధానిగా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలు కాక ముందే మరో విపత్తు సంభవించింది. తీర ప్రాంతంలో సముద్రపు అలల నుండి వచ్చే చల్లటి గాలులతో నిత్యం పులకించిపోయే విశాఖట్టణం విషపు కోరల మద్య చిక్కుకుంది. దాదాపు రెండు నెలల తర్వాత తెరుచుకున్న రసాయన పరిశ్రమనుండి వెలువడిన విషవాయులను వల్ల విశాఖ ప్రజానికం చిగురుటాకులా వణికిపోయారు. స్వఛ్చమైన ప్రాణవాయువును కలుషితం చేసి ప్రజల ప్రాణలతో చెలగాటమాడిన దుర్థటన పట్ల రాష్ట్ర గవర్నర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జరిగిన విషాద ఘటన పట్ల ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
విషవాయువుతో విశాఖ విలవిల.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్..
విశాఖపట్టణంలో విషవాయువు లీక్ ఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషవాయువు ప్రభావంతో పలువురు మృతి చెందడం, అధిక సంఖ్యలో ఆసుపత్రుల పాలు కావడంపై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ వర్గాలకు గవర్నర్ సూచించారు. అలాగే తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని రెడ్క్రాస్ సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్ ఆర్ వెంకటాపురంలో దుర్ఘటన బాధాకరమని, అనేకోకుండా జరిగే విపత్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించడమే కాకుండా ప్రాణ నష్టం కలగకుండా చూడాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
బాదితులకు మెరుగైన వైద్యం అందించాలి.. ప్రభుత్వ వర్గాలకు గవర్నర్ సూచన..
ఇలాంటి దుర్ఘటనల పట్ల మానవాళికే కాకుండా మూగజీవాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. విశాఖలో చెల రేగిన విషవాయువు వల్ల ఎన్నో మూగజీవాలు మృతిచెందాయని, కొన ఊపిరితో ఉన్న ప్రజలను, మూగజీవాలను కాపాడాలని గవర్నర్ అన్నారు. కాగా విశాఖలో ఫార్మా కంపెనీ ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. గ్యాస్ లీక్ ప్రమాద ఘటన వివరాలు కలెక్టర్ని అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైజాగ్ వెళ్లనున్నారు. సుమారు మద్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో వైజాగ్ వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు.
రసాయన పరిశ్రమల ప్రమాణాలు పరిశీలించాలి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్..
ఇదిలా ఉండగా విశాఖపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విష వాయువులు విడుదలై అయిదు కిలోమీటర్ల మేర ప్రజలు భయకంపితులు కావడం, 8 మంది మృతి చెందటం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. అంతే కాకుండా వందల సంఖ్యలో తీవ్ర అస్వస్థతకు లోనవడం హృదయవిదారకమని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు తన తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేసారు. మృతుల కుంటుంబాలకు నష్టపరిహారంతో పాటు, చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని పవన్ డిమాండ్ చేసారు.
Recommended Video
హృదయ విదారక ఘటన.. తక్షణం ఆదుకోవాలన్న పవన్ కళ్యాణ్..
ప్రభుత్వం తక్షణం పరిశ్రమల్లోని భద్రతా ప్రమాణాలు, కాలుష్య నియంత్రణ చర్యలను పరిశీలించాలని కోరారు. అదే విధంగా పరిశ్రమల నుంచి విష రసాయనాలు, వ్యర్థాలు వెలువడుతుండటంతో ప్రజలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నామని, చర్యలు తీసుకోవాలని అధికారులకు పలు సందర్బాల్లో విజ్ఞప్తి చేస్తున్నా స్పందించకపోవడంతోనే ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకొంటున్నాయని పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇలాంటి పరిశ్రమల విషయంలో నిర్లిక్ష్యంగా వ్యవహరించడంతో ఇలంటి దుర్థటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు పవన్. ప్రజారోగ్యం పట్ల, పర్యావరణ పరిరక్షణపట్ల బాధ్యతగా ఉండడమే కాకుండా కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేసారు పవన్ కళ్యాణ్.