తొలగిపోయిన కష్టాలు... ద్రవ్య వినిమయ బిల్లుకు ఏపీ గవర్నర్ ఆమోదం...
ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమియ బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం(జూలై 2) ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులు,ప్రభుత్వ ఖర్చులకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పటికే ఒకరోజు ఆలస్యమైన ఉద్యోగుల జీతాలు ఒకటి,రెండు రోజుల్లో వారి ఖాతాల్లో పడే అవకాశం ఉంది.
గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీలో ఆమోదం పొందిన ద్రవ్య వినిమయ బిల్లుకు మండలిలో మాత్రం బ్రేక్ పడింది. అసెంబ్లీలో ఆరోజు పాలనా వికేంద్రీకరణ బిల్లు,సీఆర్డీయే రద్దు బిల్లులపై మొదట చర్చ జరగాలని వైసీపీ పట్టుబట్టడంతోనే ద్రవ్య వినిమియ బిల్లుకు బ్రేక్ పడిందని టీడీపీ నేతలు ఆరోపించారు. వైసీపీ మాత్రం టీడీపీ దురుద్దేశపూర్వకంగా కావాలనే బిల్లుకు అడ్డుపడిందని ఆరోపించింది.
ఆరోపణల సంగతెలా ఉన్నా.. సాంకేతికంగా మండలికి బిల్లు పంపించిన 14 రోజుల తర్వాత ఆటోమేటిగ్గా ఆమోదం పొందినట్లే. తాజాగా 14 రోజుల గడువు ముగియడంతో ప్రభుత్వం ఆ బిల్లును గవర్నర్కు పంపించింది. గవర్నర్ ఆమోదం తెలపడంతో ద్రవ్య వినిమయ బిల్లు చట్టరూపం దాల్చింది. దీంతో ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోనున్నాయి.