మంత్రులు..అధికారులు ఆయన వైపు చూడండి : ఏపీ గవర్నర్ ను చూసైనా: ఏం చేసారంటే..!
రాష్ట్ర ప్రథమ పౌరుడు. వ్యవహారంలో మాత్రం సాధారణ పౌరుడు. ఎక్కడా ఆర్భాటాలకు అవకాశం లేకుండా.. ఎవరికీ ఇబ్బంది కలగనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. అధికారం అనుభవించే కొందరు మంత్రులు..అధికారులకు దిమ్మ తిరిగేలా వ్యవహరించారు. ఏపీలో ఉన్న ఆర్దిక పరిస్థితుల పైన అవగాహన ఉన్న గవర్నర్ వ్యవహరించ తీరు ఇప్పుడు ఆసక్తి కరంగా..ఆదర్శంగా మారింది. రాష్ట్ర గవర్నర్ హోదా లో ఉంటూ ఆయన బాధ్యతగా నడుచుకున్న తీరు చూసి ఇప్పుడు కొందరు మంత్రులు..కొందరు అధికారులు ఖచ్చితంగా అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా..తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్లిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ లో ఆచరించిన లో ప్రొఫైల్ ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లోనే కాదు...సాధారణ ప్రజల్లోనూ చర్చకు కారణమైంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు ...నేడే కీలక ఘట్టం .. గరుడ వాహన సేవ
ఏపీ గవర్నర్ ఇంత సింపుల్ గా...
చిన్నప్పటి నుండి సామాజిక సేవ..ఆరెస్సెస్ నేపథ్యం..సమస్యల పట్ల అవగాహన ఉన్న రాష్ట్ర గవర్నర్ ఇప్పుడు మరో సారి తన ప్రత్యేకత చాటుకున్నారు. తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు వెళ్లాలని ఆయన అనుకున్నారు. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ప్రత్యేక విమానంలో వెళ్లవచ్చు. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తామని అధికారులూ చెప్పారు. ప్రత్యేక విమానం అంటే చాలా అద్దె ఉంటుంది.. అవసరం లేదు.. మామూలుగా అందరితో పాటే విమానంలో వెళ్తానని ఆయన చెప్పారు. అయితే విజయవాడ నుంచి తిరుపతికి నేరుగా వెళ్లేందుకు విమాన సర్వీసు లేదని అధికారులు అన్నారు. పర్వాలేదు.. హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి తిరుపతి చేరుకుంటానని వెళ్లారు. అదే విధంగా తిరుమలకు చేరుకొని బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు.
సాధారణ విమానంలో ప్రయాణం..
అధికారంలో ఉన్న వారు తమ దర్పం ప్రదర్శించటానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆర్దికంగా ఏపి కష్టాల్లో ఉన్న గత ప్రభుత్వంలోని వారైనా..ప్రస్తుత ప్రభుత్వంలోని వారైన ఎక్కడా ఖర్చులు తగ్గించుకొనే ప్రయత్నాలు చేయటం లేదు. పూర్తిగా తమ అధికారిక హోదాలో వచ్చే అన్ని సౌకర్యాలను ఆస్వాదిస్తున్నారు. ఇదే సమయంలో గవర్నర్ తాను చెప్పదలచుకున్నది మాటల ద్వారా కాకుండా..చేతల ద్వారా నిరూపించారు. లక్షల రూపాయలను వృథాగా ఖర్చు చేయడం మాని.. సాధారణ విమానంలో వెళ్లారు. స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం మళ్లీ కిందకు వచ్చి.. తిరుపతి నుంచి హైదరాబాద్కు సాధారణ విమానంలో వచ్చారు. అక్కడి నుంచి మరో సాధారణ విమానంలో విజయవాడ చేరుకున్నారు.
తిరుమలలోనూ లో ప్రొఫైల్...
ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారు తిరుమలకు వస్తే వారి హంగామా ప్రత్యేకంగా ఉంటుంది. వారికి బస ఏర్పాట్లు మొదలు..దర్శనం..వసతుల వరకు అన్నీ ప్రత్యేకమే. అయితే..రద్దీ ఎక్కువగా ఉన్న సమయం అందునా బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల వెళ్లిన గవర్నర్ విభిన్నంగా వ్యవహరించారు. తిరుమల కొండపై కూడా ఎక్కువ సేపు ఉండలేదు. తానక్కడ అధిక సమయం గడిపితే సామాన్య భక్తులకు ఇక్కట్లు ఎదురవుతాయని భావించారు. తిరుమలలో గెస్ట్హౌ్సలో ఉన్నా.. ఆలయ ప్రాంగణంలో ఉన్నా.. టీటీడీ అధికారులంతా తన సౌకర్యాలమీదే దృష్టిపెడతారన్న ఉద్దేశంతో కేవలం గంట పాటే అక్కడున్నారు. ఎటువంటి ఆర్బాటాలు చేయవద్దని స్పష్టం చేసారు. సాదా సీదాగా దర్శనం ముగించుకొని తిరుగు పయణమయ్యారు.