ఎస్ఈసీ, ఉద్యోగులకు గవర్నర్ షాక్- అపాయింట్మెంట్ల నిరాకరణ- సుప్రీం తీర్పు తర్వాతే
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఇప్పుడు ప్రభుత్వం, ఎన్నికల సంఘం, ఉద్యోగులు, అభ్యర్ధులు, ఓటర్లు ఇలా అందరికీ కీలకంగా మారింది. దీంతో సుప్రీంకోర్టు తీర్పు సానుకూలంగా వచ్చినా, వ్యతిరేకంగా వచ్చినా అనుసరించాల్సిన తీరుపై గవర్నర్తో చర్చించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్తో పాటు ఉద్యోగ సంఘాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఈ మేరకు గవర్నర్ అపాయింట్ మెంట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
సుప్రీం ఒప్పుకున్నా సహాయనిరాకరణే ?పంచాయతీపై ఉద్యోగుల వ్యూహమిదే- అదెలా లీకైంది ?
పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కీలకంగా మారడంతో ఆ లోపు ఏ నిర్ణయం తీసుకోవడానికీ వీల్లేకుండా పోయింది. దీంతో ఇటు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు కానీ, అటు ఉద్యోగ సంఘాలకు కానీ గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుతో ఎలాగో ఓ క్లారిటీ వస్తుంది కాబట్టి ఇప్పుడు హడావిడిగా చర్చించడానికి ఏముంటుందన్న ఆలోచనలో గవర్నర్ హరిచందన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వీరంతా అపాయింట్మెంట్లు కోరుతున్నా స్పందించడం లేదని చెప్తున్నారు.
ఏపీలో ఎస్ఈసీ ఇప్పటికే ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టి నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కలెక్టర్లు ఇప్పటివరకూ ఎన్నికల ప్రక్రియపై దృష్టిసారించడం లేదు. దీనిపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసేందుకు నిమ్మగడ్డ సిద్ధమయ్యారు. శనివారమే ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ కోరినా అవకాశం దొరకలేదు. దీంతో మరోసారి అపాయింట్మెంట్ కోరారు. అయినా సుప్రీంకోర్టు తీర్పు వరకూ వేచి చూడాలని గవర్నర్ భావిస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాతే ఎస్ఈసీకి అవకాశం దొరకవచ్చని భావిస్తున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా ఇదే అంచనాతో ఉన్నాయి.