ఏపీ చరిత్రలో తొలిసారిగా: ఈ సారి బడ్జెట్ సమావేశాల్లో అదే హైలైట్..ఎన్నో స్పెషాలిటీస్
అమరావతి: కాస్సేపట్లో రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభం కాబోతున్నాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య శాసనసభ, శాసన మండలి భేటీ కాబోతున్నాయి. రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో ఉభయ సభలు సమావేశం కాబోతోండటం వల్ల చరిత్రలో నిలిచిపోయేలా కొన్ని ప్రత్యేక సందర్భాలు కనిపించనున్నాయి. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ ఉదయం 10 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. శుక్రవారమే ముగుస్తాయి.
సభకు రాకుండా రాజ్భవన్ నుంచే..
గవర్నర్ తన ప్రసంగాన్ని రాజ్భవన్ నుంచి పూర్తి చేస్తారు. దీనికి అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. రాజ్భవన్లోని దర్బార్ హాలు నుంచి గవర్నర్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఓ రాష్ట్ర గవర్నర్ సభకు హాజరు కాకుండా.. రాజ్భవన్ నుంచే ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాట్లు చేశారు.
బడ్జెట్ భేటీ రెండు రోజుల్లోనే..
సాధారణంగా ఓ ఏడాది కాలంలో అసెంబ్లీ మూడుసార్లు సమావేశమౌతుంటుంది. ఈ మూడింట్లో అత్యంత సుదీర్ఘంగా సాగే సెషన్స్.. బడ్జెట్ సమావేశాలే. ఉమ్మడి రాష్ట్రంలో గరిష్ఠంగా 45 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సారి మాత్రం సంప్రదాయానికి భిన్నంగా.. రెండంటే రెండురోజుల్లోనే సమావేశాలు ముగియబోతున్నాయి. ఓ రకంగా చూస్తే.. ఇదీ రికార్డే. 48 గంటల కంటే తక్కువ సమయంలో బడ్జెట్ సమావేశాలు ముగియడం చరిత్రలో నిలిచిపోయేదే.
ఒంటరిగా సభ్యులు..
శాసనసభ, శాసన మండలి సమావేశమౌతోందంటే.. ఆవరణలో ఒకేచోట కనీసం నాలుగు నుంచి అయిదువేల మంది గుమికూడుతుంటారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల్సీలు, వారి సిబ్బంది, అనుచరులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, మీడియా ప్రతినిధులు, అన్నిటికీ మించి బందోబస్తులో ఉండే పోలీసులు.. ఇలా వందలాది మందితో అసెంబ్లీ ప్రాంగణం కళకళలాడుతుంటుంది. సందడిగా కనిపిస్తుంటుంది. ఈ సారి ఆ కోలాహలం కనిపించదు. ఎందుకంటే- భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉన్నందున అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులకు మాత్రమే చట్టసభలో ఆవరణలోకి ప్రవేశాన్ని కల్పించారు.
విజిటర్లపైనా నిషేధం
అసెంబ్లీ ఆవరణలోకి సందర్శకులకు సైతం అనుమతించరు. సాధారణంగా అసెంబ్లీ సమావేశాల ప్రొసీడింగ్స్ను పరిశీలించడానికి రోజూ పరిమితంగా కొంతమంది సందర్శకులకు అనుమతి ఇస్తుంటారు. వారితో పాటు ఎమ్మెల్యేల బంధువులు, కుటుంబ సభ్యులు పాసుల ద్వారా మీడియా పాయింట్, లాంజ్లల్లో ప్రవేశిస్తుంటారు. అలాంటి వారికి ఈ సారి అనుమతి ఇవ్వట్లేదు. విజిటర్లను అనుమతించకూడదని నిర్ణయించారు.
Recommended Video
9 గంటలకు కేబినెట్
బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించడానికి ఈ ఉదయం మంత్రివర్గం సమావేశమౌతుంది. వార్షిక బడ్జెట్ మొత్తం 2.61 లక్షల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదిస్తుంది. ఆ వెంటనే సభ సమావేశమౌతుంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం సభ సమావేశమైనప్పుడు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెడతారు. దానికంటే ముందే- గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తీర్మానంపై చర్చ ముగిస్తారు.