ఏపీలో ఆర్టీసీ సర్వీసుల ప్రారంభం అప్పుడే.. ప్రభుత్వం కీలక నిర్ణయం..
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ లో మినహాయింపులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ఆధారంగా ఏపీలో ఆర్టీసీ బస్సు సర్వీసులను పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం ముందుగా సన్నాహాలు చేసింది. తొలుత గ్రీన్ జోన్ జిల్లా అయిన విజయనగరంలో సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించిన అధికారులు ఏర్పాట్ల కూడా పూర్తి చేశారు. పలు జాగ్రత్తలతో బస్సుల్లో ప్రయాణికులను అనుమతించేందుకు సిద్దమయ్యారు. ఏయే సర్వీసులు, ఎప్పుడెప్పుడు నడపాలో కూడా మ్యాప్ రెడీ చేశారు. కానీ చివరి నిమిషంలో మాత్రం వారికి బ్రేక్ పడింది.
గ్రీన్ జోన్ జిల్లా అయినప్పటికీ విజయనగరంలో మాత్రమే బస్సు సర్వీసులు నడిపితే ఆరెంజ్ జోన్ జిల్లాల నుంచి డిమాండ్లు పెరగవచ్చనే అభిప్రాయం ఉన్నతాధికారుల్లో వ్యక్తమైంది. కేవలం ఒకే ఒక జిల్లాలో బస్సు సర్వీసులను హడావిడిగా నడపటం వల్లే ఆర్టీసీకి వచ్చే ఆర్ధిక ప్రయోజనం కూడా లేదు. దీంతో నిన్న సాయంత్రం తర్వాత లాక్ డౌన్ సడలింపులపై చర్చించేందుకు విజయవాడలోని ఆర్టీసీ హౌస్ లో సమావేశమైన ఉన్నతాధికారులు విజయనగరంలోనూ సర్వీసులు వద్దని తేల్చేశారు. ఈ మేరకు విజయనగరం అధికారులకు సమాచారం అందించారు. దీంతో చివరి నిమిషంలో వారి ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయి.
Recommended Video
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ ను ప్రతీ వారం రోజులకోసారి అధికారులు సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజుల తర్వాత ఆరెంజ్ జోన్లలో మరికొన్ని గ్రీన్ జోన్లలోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. వీటి ఆధారంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిస్ధితులు కాస్త మారితే విజయనగరం జిల్లాలో అంతర్గతంగా బస్సులు తిప్పడంతో పాటు పొరుగు జిల్లాలకు కూడా సర్వీసులు నడిపేందుకు వీలు కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే విజయనగరం జిల్లా అధికారులకు వారం రోజుల పాటు వేచి చూడాలని ఆదేశాలు వెళ్లాయి.