చంద్రబాబుపై హత్యాయత్నం: నిమ్మగడ్డలో పాలెగాళ్ల పోకడ: తిడుతోంటే చూస్తూ కూర్చోవాలా?: సజ్జల
అమరావతి: తనను పదవి నుంచి తొలగించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖ పట్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్పై వ్యంగ్యాస్త్రాలతో చెలరేగిపోయారు. నిమ్మగడ్డ బాధితుల జాబితా చాలా పెద్దదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పరిపాలనను స్తంభింపజేసేలా ఆయన నిర్ణయాలను తీసుకుంటున్నారని, ఆదేశాలను జారీ చేస్తున్నారంటూ మండిపడ్డారు.
హైపిచ్: సీఎం కోటరీలో కలకలం: జగన్ కుడిభుజాన్ని టార్గెట్ చేసిన నిమ్మగడ్డ: సీఎంఓ కీలక అధికారిపై
వ్యవహార తీరే నిదర్శనం..
కొద్దిసేపటి కిందటే ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనను తొలగించాలంటూ నిమ్మగడ్డ లేఖ రాయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ ఆరంభమైనప్పటి నుంచీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలి అత్యంత వివాదాస్పదంగా మారిందని అన్నారు. తన పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బాధ్యతాయుతంగా, ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలను నిర్వహించాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా నడుచుకుంటున్నారని ఆరోపించారు. రాచరికం, పాలెగాళ్ల పోకడలు నిమ్మగడ్డలో కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు.
రెఫరీలా వ్యవహరించాల్సింది పోయి..
ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా సాగడానికి ఎన్నికల కమిషన్ వ్యవస్థను రూపొందించారని, దానికి భిన్నంగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని అన్నారు. ఓ రెఫరీలా విధులను నిర్వర్తించాల్సిన రమేష్ కుమార్ పాలెగాళ్ల తరహాలో ప్రవర్తిస్తున్నారని అన్నారు. తన వ్యక్తిగత నిర్ణయాలను అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అసహనానికి, ఆగ్రహానికి గోపాలకృష్ణ ద్వివేదీ బలి అయ్యారని చెప్పారు. ఏ కారణంతో ద్వివేదిపై చర్య తీసుకున్నారో బహుశా నిమ్మగడ్డకు కూడా తెలియదేమోనని వ్యాఖ్యానించారు.
చంద్రబాబుపై అటెంప్ట్ టు మర్డర్ కేస్..
గోపాలకృష్ణ ద్వివేదీ ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఆయనపై ప్రవర్తించిన తీరు ఎలాంటిదో అందరూ చూశారని సజ్జల గుర్తు చేశారు. నేరుగా ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలోకి దూసుకెళ్లి.. వేలెత్తి బెదిరించిన దృశ్యాలను ఎవ్వరూ మర్చిపోరని అన్నారు. అలా ప్రవర్తించినందుకు ద్వివేది.. చంద్రబాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి ఉండొచ్చని అన్నారు. ద్వివేది సంయమనంతో వ్యవహరించారని చెప్పారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేలా, దాని నుంచి పక్కదారి పట్టించే ఏ ఒక్క అంశాన్ని కూడా ద్వివేదీ పట్టించుకోలేదని ప్రశంసించారు. అలాంటి సంయమనం నిమ్మగడ్డ రమేష్ కుమార్లో కనిపించట్లేదని సజ్జల అన్నారు.
పంచాయతీ ఎన్నికలే ఎందుకు..
గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడ ఆగాయో.. అక్కడి నుంచే మళ్లీ పునఃప్రారంభిస్తామని మొదట్లో ప్రకటించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. దానికి ఎందుకు కట్టుబడి ఉండలేదని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలను ఎందుకు ముందుకు తీసుకుని రావాల్సి వచ్చిందని నిలదీశారు. నిమ్మగడ్డ దుర్బుద్ధేమిటో ఇక్కడే స్పష్టమైందని అన్నారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు లబ్ది కలిగించేలా మాత్రమే నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని సజ్జల ఆరోపించారు. ఊరూ, పేరు లేని పార్టీ నేతల సంతకాలతో క్లెయిమ్ చేసుకున్నారని విమర్శించారు.
టీడీపీ ఆఫీస్లో కూర్చోండి..
నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చొని తమను విమర్శిస్తే.. ఎవరికీ అభ్యంతరం ఉండదని, రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారిగా తమను విమర్శిస్తున్నారని అన్నారు. చంద్రబాబు పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడంలో రాజ్యంగబద్ధమేనా అని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన ఏ ఒక్క హామీ కూడా చంద్రబాబు అమలు చయలేరని అన్నారు. ఆ విషయం ఆయనకీ తెలుసునని ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేయడానికే చంద్రబాబు ఎన్నికల వ్యవస్థ, ప్రక్రియను వాడుకుంటున్నారని మండిపడ్డారు.