ఇంట్లో ఎలుక ఉంటే ఇల్లు తగలబెడతారా? సర్కార్పై భగ్గుమన్న కన్నా
రాజధాని మార్పు అనేది ఇంట్లో ఎలుక ఉంటే ఇల్లు తగులబెట్టినట్టు ఉందని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాజధాని మార్పుపై ఏపీ ప్రభుత్వం సహేతుక కారణం చెప్పడం లేదన్నారు. ఓ సారి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, మరోసారి ఎడారి అవుతోందని, అడవీలో ఉందని, ముంపునకు మునిగిపోతుందని, చివరి లక్ష కోట్లు అని చెప్పి గందరగోళానికి గురిచేస్తుందన్నారు. రాజధాని ఇందుకోసం మారుస్తున్నామని ఏపీ సీఎం జగన్ గానీ మంత్రులు గానీ ధైర్యంగా చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు.
బీజేపీ వెల్కం..
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు బీజేపీ స్వాగతిస్తోందని కన్నా చెప్పారు. ఇప్పుడే కాదు గతంలో చంద్రబాబు నాయుడుకు కూడా లేఖ రాశామని గుర్తుచేశారు. జీవీఎల్ నరసింహారావు, మురళీధర్ రావు కలిసి.. చంద్రబాబును కోరిన విషయాన్ని గుర్తుచేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు ఓకే కానీ.. డెవలప్ పేరుతో పరిపాలనను వికేంద్రీకరించడాన్ని మాత్రం బీజేపీ తప్పుపడుతోందని స్పష్టంచేశారు. సచివాలయాన్ని విశాఖకు తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. జగన్ చేస్తున్న అరాచక పాలనపై ప్రజాక్షేత్రంలో పోరాడుతామని చెప్పారు.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
రాజధానిని మార్చబోమని ఎన్నికల ముందు చెప్పినా జగన్.. అధికారం చేపట్టాక మారుస్తూ మాట తప్పారని విమర్శించారు. గత ప్రభుత్వంలో కూడా ప్రజా వ్యతిరేకత వచ్చిందని.. ఇప్పుడు కూడా ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనకు చరమగీతం పాడారని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కూడా అదే పరిస్థితి ఏర్పడబోతుందని జోస్యం చెప్పారు.
పులివెందులకు 1400 కోట్లా..?
సీఎం జగన్మోహన్ రెడ్డి వెనకబడిన జిల్లాలపై ఎందుకు వివక్ష చూపిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. పులివెందులకు 1400 కోట్లు కేటాయించి, వెనకబాటుకు గురైన జిల్లాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
క్లారిటీ ఉంది..
రాష్ట్ర పరిధిలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదన్నారు. రాజధాని మార్పు అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని చెప్పారు. ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తే తప్ప.. సుమోటోగా స్పందించే పరిస్థితి ఉండబోదన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా అరాచక పాలన కొనసాగిందని చెప్పారు. బీజేపీ-జనసేనలో కూడా రాజధాని అంశం సహా ఇతర అంశాలపై క్లారిటీతో ఉన్నాయని చెప్పారు.