కరోనా కొత్త లక్షణాలను ప్రకటించిన ఏపీ సర్కార్ .. వాంతులు, డయేరియాతో తస్మాత్ జాగ్రత్త !!
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు మన దేశంలోనే 20 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న పరిస్థితి ప్రజలకు, ప్రభుత్వాలకు ఆందోళన కలిగిస్తోంది. సగటున రోజుకు 500 మంది వరకు కరోనా బారినపడి మరణిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఇప్పటివరకు కరోనాకు చెప్పిన లక్షణాలే కాకుండా,అదనంగా మరికొన్ని లక్షణాలు కూడా కరోనా వ్యాధిగ్రస్తులకు ఉంటున్నాయని చెబుతోంది ఏపీ సర్కార్.
ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం .. ఇక ఎస్ఎంఎస్ ద్వారా కరోనా టెస్ట్ రిపోర్ట్ నేరుగా వారికే .. రీజన్ ఇదే
కరోనా కొత్త లక్షణాలను ప్రకటించిన ప్రభుత్వం
కరోనావైరస్ వ్యాప్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతున్న కారణంగా ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా సోకిందని గుర్తించడానికి అదనంగా మరికొన్ని లక్షణాలు చేరుస్తూ ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా కరోనా వైరస్ సోకిన పేషెంట్లలో జలుబు,దగ్గు,గొంతు నొప్పి,ఒళ్ళు నొప్పులు,రుచి,వాసన తెలియక పోవడం వంటి లక్షణాలు ఉంటాయని ఇప్పటివరకు నిర్ధారించారు. అయితే తాజాగా కరోనా లక్షణాలలో మరికొన్ని చేరినట్లుగా ఏపీ కోవిడ్ 19 కమాండ్ కంట్రోల్ రూమ్ పేర్కొంది.
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ రీసెర్చ్ లో కరోనా కొత్త లక్షణాలు
అమెరికాలో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనే సంస్థ జారీచేసిన కీలక ప్రకటన ఆధారంగా మరికొన్ని లక్షణాలు కూడా కరోనా లక్షణాలు అని తేల్చింది. ఇక అదనంగా చేరిన కరోనా లక్షణాలను గమనిస్తే వికారం లేదా వాంతులు,డయేరియా, ముక్కు కారడం వంటి లక్షణాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, శరీరం అలసటగా ఉండటం, వణుకు, బాగా తలనొప్పిగా ఉండటం వంటి లక్షణాలు కరోనా కు సంబంధించిన లక్షణాలు గా పేర్కొన్నారు. ఇక గతంలో చెప్పిన లక్షణాలు, కొత్తగా చేరిన లక్షణాలతో కలిపి మొత్తం 11 లక్షణాలను సిడిసి పేర్కొంది.ఈ లక్షణాలు కరోనావైరస్ సోకిన రెండు నుంచి 14 రోజుల్లో కనిపిస్తాయని ఏపీ కోవిడ్ కంట్రోల్ రూమ్ పేర్కొంది.
ఏ లక్షణాలున్నా సరే అప్రమత్తంగా ఉండటం అవసరం ..
వికారం లేదా వాంతులు, డయేరియా కూడా కరోనా లక్షణాలే అని తెలిపింది. కొత్తగా కనుగొన్న వాటితో కలిపి మొత్తం 11 లక్షణాలను సీడీసీ తన అధికారిక జాబితాలో చేర్చింది. అధికారిక వెబ్సైట్లో కూడా వీటికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది. ఈ లక్షణాలు వైరస్ సోకిన 2 నుంచి 14 రోజుల్లోపు కనిపిస్తాయని ఏపీ కొవిడ్ కంట్రోల్ రూమ్ పేర్కొంది.అంతే కాదు లక్షణాలు ఎవరికైనా ఉంటే అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని,ఇంట్లో కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం మంచిదని ఏపీ కోవిడ్ 19 నోడల్ అధికారి పేర్కొన్నారు.
డయేరియా , వాంతులు కూడా కరోనా లక్షణాలే
శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఉన్నప్పుడు, ఒంట్లో బాగా నీరసంగా ఉన్నప్పుడు, పెదవులు ముఖం నీలి రంగులోకి మారడం గమనించినప్పుడు, చాతి లో నిరంతరం నొప్పిలా అనిపిస్తున్నప్పుడు, డయేరియా , వాంతులు అవుతుంటే వెంటనే స్థానికంగా ఉండే ఆరోగ్య సిబ్బందిని లేదా వైద్యులను సంప్రదించాలని 104కి కాల్ చేయాలని చెప్తున్నారు. ఏది ఏమైనా రోజురోజుకీ కరోనా విస్తరిస్తున్న సమయంలో లక్షణాల జాబితా కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు సాధారణ తలనొప్పి వచ్చినా, సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు వచ్చినా భయపడుతున్న పరిస్థితి ప్రజలలో కనిపిస్తుంది.
కరోనా విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్న ఏపీ సర్కార్
ఇప్పటి వరకు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13,098 కేసులు నమోదయ్యాయి.రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న తీరుతో ఏపీ ప్రజలకు నిద్ర పట్టడం లేదు. ఇందులో యాక్టివ్ కేసు విషయానికి వస్తే 7021 కేసులు యాక్టివ్ గా ఉండగా, 5,908 కేసులు రికవర్ అయ్యి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా మరణాలు చూసినట్లయితే 169 మంది మరణించారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన అధికారులు కరోనాలక్షణాల జాబితాలో కొత్త లక్షణాలు కూడా ఉన్నాయని ప్రకటన విడుదల చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.