టీడీపీ నేతల మెడకు ఉచ్చు: అమరావతి భూ ఆక్రమణలపై సీబీఐ విచారణ: అసలు టార్గెట్ వారే..!
అమరావతి: కరోనాతో కలకలకం రేగుతున్న సమయంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతి రాజధాని పరిధిలో భూ కుంభకోణం జరిగిదంటూ కేబినెట్ సబ్ కమిటీ వేసి..పేర్లు బయట పెట్టిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ కేసును సీఐడి నుండి సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగానే రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పి..పార్టీ నేతలకు మేలు కలిగేలా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని వైసీపీ ఆరోపణ.
దీని పైన అధికారంలోకి రాగానే కేబినెట్ సబ్ కమిటీ నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు దాదాపు నాలుగు వేల ఎకరాల్లో అక్రమాలు జరిగాయంటూ ..టీడీపీ నేతల పేర్లను శాసనసభలో ప్రస్తావించింది. ఇక, ఈ వ్యవహారం విచారించిన సీఐడీ నుండి ఇప్పటికే ఆదాయపు పన్ను..ఈడీ అధికారులు సమాచారం రాబట్టారు. ఇక, ఇప్పుడు ఈ కేసును సీబీఐకి అప్పగించటంతో ఈ కేసు వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది.
టీడీపీ నేతలు..బినామీలే సూత్రధారులంటూ
రాష్ట్ర విభజన తరువాత 2014లో అధికారంలో వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అదే ఏడాది డిసెంబర్ లో అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అంతుకు ముందే పలు ప్రాంతాల్లో రాజధాని వస్తుందంటూ లీకు లు ఇవ్వటం ద్వారా సామాన్య ప్రజలను మభ్య పెట్ట..కేవలం పార్టీ నేతలకు అసలు రాజధాని ఎక్కడ వస్తుందో ముందే లీక్ చేసి వారికి లబ్ది కలిగిలే వ్యవహరించిందనేది వైసీపీ ఆరోపణ. దీని పైన అధికారంలోకి రాగానే నియమించిన కేబినెట్ సబ్ కమిటీ దాదాపు నాలుగు వేల ఎకరాల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని..మొత్తం టీడీపీ నేతలు వారి బినామీలే ఈ కొనుగోళ్లు చేసారని తేల్చింది.
సీఐడీ నుంచి సీబీఐకి
గత డిసెంబర్ లో కేబినెట్ సబ్ కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో..ప్రభుత్వం వారి పేర్లను సభలో ప్రస్తావించింది. ఇక, ఈ మొత్తం వ్యవహారం పైన సీఐడీ విచారణ కొనసాగింది. ఇందులో సూత్రధారులు..పాత్రధారులు ఎవరున్నారో వారి పేర్లను ఆదాయపు పన్ను శాఖ..ఈడీ అధికారులు సేకరించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ రాజధాని భూ కుంభకోణం వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ సిఐడి నమోదు చేసిన కేసును సీబీఐ కు బదిలీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
టీడీపీ నేతలే లక్ష్యంగా ఈ నిర్ణయం...
గత డిసెంబర్ లో జరిగిన శాసనసభా సమావేశాల్లో కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు అమరావతి భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ టీడీపీ నేతల పేర్లను ఆర్దిక మంత్రి బుగ్గన సభలో ప్రస్తావించా రు. అందులో చంద్రబాబు బంధువులతో పాటుగా మంత్రులుగా పని చేసిన పుల్లారావు..నారాయణ..పరిటాల సునీత వంటి వారి పేర్లను మంత్రి సభలో చెప్పుకొచ్చారు. వీరితో పాటుగా చంద్రబాబు తనయుడు లోకేశ్ బినామీలు అంటూ కొందరి పేర్లను మంత్రి చెప్పుకొచ్చారు. ఇక, టీడీపీ ముఖ్య నేతలు ధూళిపాళ్ల నరేంద్ర. పయ్యావుల కేశవ్, జీవీ ఆంజనేయులు, పల్లె రఘునాధ రెడ్డి, బాలక్రిష్ణ వియ్యంకుడు, లింగమనేని, హెరిటేజ్ సంస్థ, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి వంటి వారి పేర్లను ప్రస్తావించారు. ఇందులో పలువురు తమ పేర్లను చెప్పటం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఈ మొత్తం వ్యవహారం పైన అసవరమైతే హైకోర్టు సిట్టింగ్ జడ్డి తో విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం కరోనాతో కల్లోలంగా మారిన సమయంలో సీబీఐ కు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయం..టీడీపీ నేతలే లక్ష్యం కానున్నారు. దీంతో..సీబీఐ విచారణ ద్వారా రాజకీయంగా కొత్త సమీకరణాలు తెర మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.