ఏపీలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి జగన్ సర్కార్ మరో కీలక అడుగు ..2050 కోట్ల నిధులు
ఏపీలో వైద్య కళాశాలల సంఖ్యను పెంచి , కొత్త కళాశాలలను ఏర్పాటు చేసి, వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందులో భాగంగా ఇప్పటికే ఉన్న 11 మెడికల్ కళాశాల తో పాటుగా మరో 16 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని సంకల్పించింది . ఏపీలో మెడికల్ కాలేజీల నిర్మాణాలకు సంబంధించి నేడు మరో కీలక అడుగు ముందుకు వేసింది.
నాలుగు మెడికల్ కళాశాలల నిర్మాణానికి సంబంధించి 2050 కోట్ల రూపాయల పరిపాలన అనుమతులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రతి పార్లమెంటు నియోజకవర్గాలలో మెడికల్ కళాశాలల ఏర్పాటుకు నిర్ణయించారు.
కడప జిల్లా పులివెందులలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 500 కోట్లు, విశాఖ జిల్లా పాడేరు లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు 500 కోట్లు, గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ లో మెడికల్ కళాశాల ఏర్పాటు 500 కోట్లు, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మెడికల్ కళాశాల నిర్మాణానికి 550 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.
నేడు ఆ నిధులను విడుదల చేసింది . అమలాపురం ,ఏలూరు, పిడుగురాళ్ల, పులివెందుల, మదనపల్లి, ఆదోని కాలేజీ స్థలాల కొనుగోలుకు 104 .17 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. పులివెందుల, పిడుగురాళ్ల కళాశాలలలో ఒక్కొక్కచోట 100 ఎంబీబీఎస్ సీట్లు, మచిలీపట్నం కళాశాలలో 150 ఎంబిబిఎస్ సీట్లు ఇచ్చే లాగా మెడికల్ కళాశాలల ఏర్పాటు చేయనుంది. మెడికల్ కళాశాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు జారీ చేసిన ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయం మేరకు ఒక్కో అడుగు ముందుకు వేస్తుంది.