ఎవరి మెడకు ఉచ్చు బిగిసేను: విశాఖ భూ కుంభకోణాలపై సిట్: ఈ సారి వారితో..వ్యూహం మారింది..!
విశాఖలో రాజకీయంగా పట్టు సాధించేందుకు కొద్ది కాలంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న వైసీపీ ఇప్పుడు ప్రభుత్వ పరంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో జరిగిన భూ కుంభకోణాల పైన సిట్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. భూ కుంభకోణం..అక్రమాల పైన సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. గతంలో ప్రభుత్వం పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తే..ఇప్పుడు రిటైర్డ్ ఐఏయస్..న్యాయాధికారులతో ఈ కమిటీ ఏర్పాటు చేసింది. విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వటానికి మూడు నెలల సమయం నిర్దేశించింది.
సీఎం జగన్ కు రిలీఫ్ దొరికేనా: నేడు కీలక విచారణ: నిర్ణయం పై ఉత్కంఠ..!
దీని ద్వారా ఈ దందాల్లో ఎవరు ఉన్నారనే విషయాన్ని తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, ఇది రాజకీయంగానూ సంచనలంగా మారే అవకాశం ఉంది. విశాఖ టీడీపీలో నెలకొన్ని విభేదాలు దీని కారణంగా మరోసారి రచ్చకెక్కే అవకాశం ఉంది. అదే విధంగా ఈ సారి బాధితులు మరింత స్వేచ్ఛంగా కమిటీ ముందుకు వస్తారని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం సైతం ఈ వ్యవహారంలో పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
విశాఖ భూ కుంభకోణాలపై సిట్
విశాఖ కేంద్రంగా సాగిన భూ కుంభకోణాల పైన సమగ్ర విచారణ దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దల కోట్లలో సాగిన ఈ కుంభకోణాలపై విచారణకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. వాస్తవానికి అప్పట్లోనే భూదందాలను సాక్షి వరుస కథనాలతో వెలుగులోకి తేవడం.. రచ్చ కావడంతో అప్పటి టీడీపీ సర్కారు సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించింది.కానీ, అప్పట్లో ఇచ్చిన నివేదిక బయటకు రాలేదు. దీంతో..ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇద్దరురిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఒక రిటైర్డ్ జిల్లా సెషన్స్ జడ్జితో కూడిన ఈ బృందం.. జిల్లాలో జరిగిన భూ కుంభకోణాలపై మూడు నెలల్లో సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పిస్తుంది. విశాఖ భూ కుంభకోణం పైన విచారణ చేయిస్తానని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు.
సిట్ చీఫ్గా డా. విజయ్కుమార్..
రిటైర్డ్ సీనియర్ ఐఎఎస్ అధికారి డా.విజయ్కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వైవీ అనురాధ, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి టి.భాస్కరరావులను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. సిట్ బృందం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని నిర్దేశించింది. సభ్యులుగా అవసరమైతే అర్హులైన వారిని నియమించుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ ప్రభుత్వంలో ఫిర్యాదులు చేసిన వారు సైతం మరోసారి సిట్ కు తమ ఫిర్యాదులను అందిచవచ్చు. సాధారణ సైతం సిట్ ను కలిసి ఫిర్యాదులు చేయటంతో పాటుగా తమ వద్ద ఉన్న సమాచారాన్ని సైతం సిట్ కు అందచేయవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రాజకీయంగా ఎవరి మెడకు చుట్టుకొనేను..
ఇక, రాజకీయంగా విశాఖలో బలపడాలని చూస్తున్న వైసీపీ..ఈ భూ కుంభకోణంలో దోషలు టీడీపీ నేతలే అని ఆరోపిస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం సిట్ నియమించిన సమయంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు..బీజేపీ ఎమ్మెల్యేగా పని చేసిన విష్ణు కుమార్ రాజ సైతం సిట్ ను కలిసి ఫిర్యాదు చేసారు. వారు అప్పటి మంత్రి గంటా లక్ష్యంగా ఫిర్యాదులు చేసినట్లు ప్రచారం సాగింది. ఇప్పుడు, తిరిగి కొత్తగా సిట్ వేయటంతో వారు సైతం తిరిగి ఫిర్యాదులు చేసే అవకాశం ఉంది. దీని ద్వారా ఇప్పటికే రాజకీయంగా విశాఖలో దెబ్బ తిన్న టీడీపీలో మరో సారి అంతర్గత విభేదాలు దీని ద్వారా బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ నేతల పాత్ర ఉందని భావిస్తుండటంతో..వారి పైన పరోక్షంగా ఒత్తిడి పెంచి టీడీపీకి దూరంగా చేసే అవకాశం కనిపిస్తోంది. అంతిమంగా ఈ విచారణ ఎవరి మెడకు చుట్టుకుటుందనే చర్చ మొదలైంది.